అద్దె ఇళ్లకు మహర్థశ...పట్టణాల్లో కొరత నివారణకు కేంద్రం సరి కొత్త విధానం
దేశవ్యాప్తంగా పట్టణాల్లో జీవించే ప్రజలకు నివాస గృహాల కొరతను తగ్గించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సరి కొత్త విధానం అమలు లోకి తేనుంది. నివాస గృహాలకు సంబంధించి ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అని చెప్పడంలో ఎళాంటి సందేహం అక్కర్లేదు.విన్-విన్ సూత్రాన్ని అనుసరించి అటు అద్దెకి ఉండే వాళ్లకి...ఇటు యజమానులకు ఇద్దరికీ ఉభయతారకంగా మేలు చేకూర్చేలా ఈ నూతన విధానంలో అమల్లోకి తేనున్నట్లు తెలిసింది.
ప్రధానంగా పట్టణాల్లో ఖాళీగా, నిరుపయోగంగా ఉంటున్న గృహాలన్నీ వినియోగంలోకి వచ్చేలా ఇళ్ల యజమానులను ప్రోత్సహించేలా ఈ విధానం ఉండనుంది. "2022 కల్లా అందరికీ ఇళ్లు" అనే ప్రధాని మోడీ నినాదం విజయవంతం చేసేందుకు గాను కేంద్రం అమలు చేయనున్న జాతీయ పట్టణ ప్రాంత ఇళ్ల అద్దె విధానం (ఎన్యూఆర్హెచ్పీ) ఇందులో కీలక పాత్ర పోషించే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది.
పట్టణాల్లో...అద్దె ఇళ్లు
భారతదేశ వ్యాప్తంగా పట్టణాల్లో నివసించే జనాభాలో 27.5 శాతం మంది అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలని బట్టి తెలుస్తోంది. అయితే మరోవైపు ఇవే పట్టణాల్లో 1.11 కోట్లు ఇళ్లు ఖాళీగా నిరుపయోగంగా ఉన్నాయనేది మరో లెక్క. అయితే ప్రజలు నివసించడానికి అనువైన నివాసం సమకూరిస్తే అది అద్దె ఇల్లా?...సొంత ఇల్లా?...తేడా లేకుండా "2022 కల్లా అందరికీ ఇళ్లు" అనే నినాదం విజయవంతమైనట్లేనని కేంద్రం భావిస్తోంది. ఈ లక్ష్యంతోనే కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎన్యూఆర్హెచ్పీని విధానం రూపొందించింది.
ఈ విధానం వల్ల...ఇరువురికీ లాభం...
నేషనల్ అర్భన్ రెంటల్ హౌసింగ్ పాలసీ(ఎన్యూఆర్హెచ్పీ)విధానం ఇళ్లను అద్దెకిచ్చేలా యజమానులను, ఆ ఇళ్లలో అద్దెకుండేలా ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఇటు కిరాయికి ఉంటున్నవారు, అటు యజమానులు...ఇరువురి ప్రయోజనాలు సమానస్థాయిలో పరిరక్షింపబడే విధంగా నూతన విధానం రూపొందించబడింది. దీనివల్ల అద్దెకు ఉన్నవారు యజమానులను ఇష్టానికి వ్యతిరేకంగా ఎక్కువకాలం అందులోనే నివాసం ఉండకుండా...అదే సమయంలో కిరాయిదారులను ఇంటి ఓనర్లు తమ ఇష్టమొచ్చినట్లుగా ఖాళీ చేయించకుండా ఈ విధానం రక్షణ కల్పించనుంది.
అతి త్వరలోనే...అమల్లోకి
యజమానులు భయం లేకుండా, ఇబ్బందిపడకుండా స్వేచ్చగా తమ ఇళ్లను అద్దెకివ్వడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన ఈ విధానానికి కేంద్ర మంత్రిమండలి త్వరలోనే ఆమోదం తెలపడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవంగా ఇళ్ల అద్దె, భూమి తదిదర అంశాలపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అయితే "2022 కల్లా అందరికీ ఇళ్లు" అనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు గాను కేంద్రం ఈ విధానంలో రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్రం ప్రవేశపెట్టే ఈ ఎన్యూఆర్హెచ్పీ వాధానంతో కొత్త వ్యాపారావకాశాలు పుట్టుకొస్తాయని కేంద్రం ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ విధానం వల్ల అద్దె నిర్వహణ సంస్థలు కొత్తగా రంగంలోకి ప్రవేశించే అవకాశముందని పేర్కొన్నట్లు తెలిసింది.
నూతన విధానం...3 విభాగాల్లో అమలు
కేంద్రం ప్రవేశపెట్టే ఎన్యూఆర్హెచ్పీ విధానంలో మొత్తం మూడు విభాగాలుంటాయని తెలుస్తోంది. అందులో మొదటిది"సామాజిక అద్దె విధానం(ఎస్ఆర్హెచ్)". ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ విభాగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. మురికివాడల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పటు చేసుకొని కనీస సౌకర్యాలు లేక ఇక్కట్లు ఎదుర్కొనే వారిని నివాసయోగ్యమైన పక్కా ఇళ్లకు చేర్చడమే ఈ విభాగం ముఖ్యోద్దేశం. ఇక రెండోది "మార్కెట్ ఆధారిత అద్దె విధానం(ఎంఆర్హెచ్)". విద్యార్థులు, ప్రొషెషనల్స్, ప్రభుత్వోద్యోగులకు అనువైన అద్దె ఇళ్లు దొరికేందుకు ఇది ఉపకరిస్తుంది. ఇక మూడో విభాగం... ప్రైవేటు అద్దె విధానం(పీఆర్హెచ్)" మొదటి రెండు విభాగాల్లోకి రాని ఇతరులందరికీ ఇది తోడ్పడుతుంది. ఎన్యూఆర్హెచ్పీతో కొత్త వ్యాపారావకాశాలు పుట్టుకొస్తాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రంగంలోకి అద్దె నిర్వహణసంస్థలు ప్రవేశించే అవకాశముందనిపేర్కొన్నాయి.