తెగి పడ్డ రిజర్వాయర్ గేట్: పోటెత్తిన వరద: తీర ప్రాంతాల్లో హైఅలర్ట్
Tungabhadra Dam: కర్ణాటకలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన తుంగభద్ర డ్యామ్ గేట్ ఒక్కసారిగా తెగిపోయింది. వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోటెత్తింది. ఫలితంగా తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దీని ప్రభావం తెలంగాణ, ఏపీల్లోని రిజర్వాయర్లపై పడే అవకాశం లేకపోలేదు.
ఇటీవల కర్ణాటకలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కర్ణాటక మొత్తం అంచనాలకు మించిన వర్షపాతం నమోదైంది. ప్రత్యేకించి- కోస్తా, ఉత్తర కర్ణాటక జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. కృష్ణా, తుంగభద్ర, కబిని, కావేరి, అర్కావతి.. వంటి నదులన్నీ వరదకు గరయ్యాయి. ఆయా నదులపై కట్టిన రిజర్వాయర్లు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి.

తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కొప్పళ తాలూకాలోని మునీరాబాద్ వద్ద ఆ నదిపై నిర్మించిన భారీ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. గరిష్ఠ మట్టానికి చేరుకుంది. అటు ఇన్ఫ్లో భారీగా ఉంటోండటంతో గేట్లను ఎత్తివేశారు జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
అదే సమయంలో రిజర్వాయర్కు చెందిన 19వ క్రస్ట్ గేటు చైన్ తెగింది. ఫలితంగా గేటు విరిగిపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1-1:30 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. నీటి ఒత్తిడిని తట్టుకోలేక చైన్ తెగడం, ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల గేట్ ఊడి కిందపడటం వంటి పరిణామాలు సంభవించాయి.
గేటు తెగిపోవడంతో రిజర్వాయర్ వద్ద 35,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహించింది. వరద వెల్లువెత్తడంతో తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ సమాచారం అందిన వెంటనే కొప్పళ ఎమ్మెల్యే కే రాఘవేంద్ర హిట్నాల్.. హుటాహుటిన రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు.
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక గేట్ను ఏర్పాటు చేయడానికి ఈ తెల్లవారుజామున బెంగళూరు నుంచి ప్రత్యేక నిపుణుల బృందం తుంగభద్ర డ్యామ్కు బయలుదేరి వెళ్లినట్లు జలమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నానికి తాత్కాలిక గేట్ను ఏర్పాటు చేస్తామని కర్ణాటక నీటిపారుదల కార్పొరేషన్ తుంగభద్ర ప్లానింగ్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ బసవరాజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications