ఉగ్రదాడి: పాక్ ఉగ్రవాది నవెద్పై చార్జ్ షీట్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని ఉదమ్ పూర్ లో జరిగిన ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు (ఎన్ఐఏ) కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. ప్రాణాలతో పట్టుబడిన పాక్ ఉగ్రవాది మహమ్మద్ నవెద్ ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడు అని ఎన్ఐఏ తెలిపింది.
మహమ్మద్ నవెద్ తో పాటు మరో 8 మంది పేర్లు చార్జ్ షీట్ లో పెట్టారు. 2015 ఆగస్టు 5వ తేది జమ్మూ కాశ్మీర్ లోని ఉదమ్ పూర్ లోని బీఎస్ఎఫ్ జవాన్ల మీద లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు విరుచుకుపడి దాడులు జరిపారు.
ఈ దాడిలో ఇద్దరు సైనికులు మరణించారు. సైనికుల ఎదురుదాడిలో ఓ ఉగ్రవాది అంతం అయ్యాడు. మహమ్మద్ నవెద్ మాత్రం ప్రాణాలతో పట్టుబడ్డాడు. స్థానికుల సహకారంతో మిగిలిన నిందితులను అరెస్టు చేశారు.

కేసు దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ చేసి గురువారం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జ్ షీటు వేశారు. ఈ కేసులో మహమ్మద్ నవెద్ మొదటి నిందితుడని, ఇంకా కేసు దర్యాప్తు జరుగుతున్నదని అధికారులు కోర్టులో చెప్పారు.
పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఈ దాడి చేసిందని ఎన్ఐఏ అధికారులు చార్జ్ షీట్ లో స్పష్టం చేశారు. మహమ్మద్ నవెద్ తదితరులు ఈ దాడి చెయ్యడానికి పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్ లో చొరబడ్డారని చార్జ్ షీట్ లో వివరించారు.
ఈ ఉగ్రదాడి కేసు విచారణలో ఉగ్రవాది మహమ్మద్ నవెద్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడని, ఆ వివరాలు చార్జ్ షీట్ లో పొందుపరిచామని అధికారులు కోర్టులో చెప్పారు. అయితే విచారణ మాత్రం ఇంకా పూర్తి కాలేదని ఎన్ఐఏ అధికారులు చార్జ్ షీట్ లో వివరించారు.












Click it and Unblock the Notifications