ఇంకా శాఖలను కేటాయించని ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాతే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇప్పటివరకు ఎవరికీ మంత్రిత్వ శాఖల కేటాయింపు జరపలేదు. తాజాగా అందరి దృష్టి ఎవరెవరికి ఏయే మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారనే అంశంపై చర్చ జరగుతోంది. కీలక శాఖలు లభిస్తాయా? లేదంటే ప్రాధాన్యత లేని శాఖల కేటాయింపు ఉంటుందా? అంటూ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో చర్చ ప్రారంభమైంది. షిండే, ఫడ్నవిస్ తో కలిపి మొత్తం 20 మంది మత్రులు ఉన్నారు. కీలకమైన హోంశాఖను ఫడ్నవిస్ దక్కించుకుంటారని, నగరాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి షిండే దగ్గరే ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
రాష్ట్ర కేబినెట్లోకి 43 మంది ఎమ్మెల్యేలను తీసుకునే అవకాశమున్నప్పటికీ రెండు వర్గాల నుంచి 18 మందిని తీసుకున్నారు. వీరిలో మహిళలెవరూ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
మహిళలకు 50% రిజర్వేషన్ అమల్లో ఉన్నప్పటికీ ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బీజేపీ, షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన భాగస్వామ్య చిన్నాచితక పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తి నెలకొంది. కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. తదుపరి మంత్రివర్గ విస్తరణ సెప్టెంబరులో ఉంటుందని అసంతృప్తులందరికీ అప్పుడు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.