మోదీని గద్దె దింపితేనే దేశం బాగుపడుతుంది..! బీజేపి సర్కార్ పై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ..!!
హైదరాబాద్: కేంద్ర బీజేపి ప్రభుత్వం పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండి పడ్డారు. మోదీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేంద్ర సర్కార్ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల తర్వాత పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశాలు ఉన్నాయని దీదీ తెలిపారు. రాయిగంజ్లో జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. మోదీని సాగనంపేందుకు అన్ని రాష్టాల్లోనూ పొత్తులు కుదిరాయని, మోదీని గద్దెదింపిన తర్వాత, నవ భారత నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
అంతే కాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి బంగ్లా అన్న పేరు పెట్టేందుకు బీజేపీ నిరాకరించిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకపక్ష తీర్మానం జరిగినా, కేంద్రం మాత్రం రాష్ట్ర పేరును మార్చేందుకు నిరాకరిస్తోందని దీదీ ఘాటుగా విమర్శించారు. బీజేపీ ఎదగడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పోరాటం చేయలేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ పుంజుకుందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ఆ పార్టీ ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుందన్నారు మమతా బెనర్జీ.