గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఆగటం వెనుక - ఏం జరుగుతోంది..!!
ఎన్నికల సంఘం ఈ రోజు గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కానీ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ మాత్రమే విడుదల అయింది. చివరి నిమిషంలో అసలు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ వాయిదా వెనుక కారణాలు ఏంటనే చర్చ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాల పరిమితి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాల పరమితి ముగియనుంది. అదే విధంగా గుజరాత్ అసెంబ్లీ కాల పరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుంది. రెండు అసెంబ్లీల కాల పరిమితి ముగియటానికి నెల రోజులే తేడా ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ రెండు రాష్ట్రాలకు ఒకే సారి షెడ్యూల్ వస్తుందని భావించారు.
అయితే, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని మోత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 12న పోలింగ్ డేట్ గా ప్రకటించారు. కానీ, ఫలితాలు మాత్రం డిసెంబర్ 8న వెల్లడిస్తామని సీఈసీ వెల్లడించారు. దీంతో..ఈ మధ్య కాలంలోనే గుజరాత్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 23న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అందునా హిమాచల్ పోలింగ్ తేదీ - ఫలితాల తేదీకి మధ్య సమయం ఎక్కువగా ఉండటం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. గుజరాత్ లో ఈ ఎన్నికల్లోనూ అధికారంలోకి రావాలనేది బీజేపీ లక్ష్యం. ప్రధాని మోదీ - అమిత్ షా సొంత రాష్ట్రం కావటంతో ఇక్కడ గెలుపు ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకంగా మారింది.
ఇప్పటికే గత మూడు నెలల కాలంలో పలు మార్లు ప్రధాని మోదీ - అమిత్ షా గుజరాత్ లో పర్యటించారు. రాజీకయంగానూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుజరాత్ ఎన్నికల బరిలో ఈ సారి ఆప్ కీలకంగా మారుతోంది. అక్కడ తమ సత్తా చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. సర్వే సంస్థలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఒపినీయన్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగానే.. ఆ ఒక్క రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. హిమాచల్ తో పాటుగా గుజరాత్ లోనూ ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి, ఎన్నికల నిర్వహణ పైన సమీక్షించారు. ఇక, ఇప్పుడు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాకపోవటం పైన రాజకీయంగా భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.