బెంగళూర్ ఎన్నికలపై ప్రభుత్వానికి సుప్రీం షాక్
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలు మూడు నెలల లోపు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీబీఎంపీని ముక్కలు చేసే వరకు ఎన్నికలు నిర్వహించరాదని భీష్మించి కుర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బతగిలింది.
మే 30 లోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత బెంగళూరును విభజించడానికి తమకు అవకాశం కావాలని కర్ణాటక ప్రభుత్వం హై కోర్టులో అర్జీ సమర్పించింది. హైకోర్టు ద్విసభ్య బెంచ్ గతంలో ఏకసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
కొందరు బీబీఎంపీ కార్పొరేటర్లు, ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కర్ణాటక ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. బెంగళూరు మహానగరాన్ని అన్ని విధాల అభివృద్ది చెయ్యడానికి మూడు భాగాలుగా విభజిస్తున్నారని, అందుకు సమయం పడుతుందని, అందువలన ఎన్నికలు నిర్వహించడం ఆలస్యం అవుతున్నదనే విషయాన్ని కోర్టులో చెప్పారు.
వాదనలు విన్న సుప్రీం కోర్టు మూడు నెలలలోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలలో బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాల పత్రాలు తమ చేతికి అందిన తరువాత ప్రభుత్వ నిర్ణయం వెల్లడిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కుళ్లు రాజకీయాలు చేస్తు బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండ చూసిందని, సుప్రీంకోర్టు ఆదేశాలు తమకు సంతోషం కలిగించిందని, ఇది ప్రజా ప్రభుత్వ విజయం అని కర్ణాటక మాజీ డిప్యూటి సీఎం ఆర్. అశోక్ చెప్పారు.