గాలి, యడ్యూరప్ప విచారణకు రంగం సిద్దం?
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, శివమొగ్గ పార్లమెంట్ సభ్యుడు బీ.ఎస్. యడ్యూరప్ప, కర్ణాటక మాజీ మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డిలను అరెస్ట్ చేస్తారని వార్తలు గుప్పుమన్నాయి.
అయితే ఇద్దరి మీద ఇప్పటికే పలు కేసులు నమోదు కావడం, విచారణ జరుగుతున్నందు వలన అరెస్టు చేస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2008 నుండి 2011వ సంవత్సరం వరకు బీఎస్ యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆ సమయంలో బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాలలో రూ. వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా డీ నోటిఫి కేషన్ చేశారని లోకాయుక్త పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ లు సిద్దం చేశారు. యడ్యూరప్పకు లోకాయుక్త అధికారులు సమూన్లు జారీ చేసే అవకాశం ఉంది.
విచారణకు హాజరు అయిన సమయంలో అక్రమంగా డీ నోటిఫికేషన్ చేశారని వెలుగు చూస్తే యడ్యూరప్పను అరెస్టు చేస్తారని పోలీసు వర్గాలు అంటున్నాయి. అయితే యడ్యూరప్ప ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అక్రమ గనుల తవ్వకాల కేసులో అరెస్టు అయ్యి మూడు సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులను ఇప్పటికే అధికారులు అరెస్టు చేశారు.
గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కారవార జిల్లాలోని బేలేకేరి హర్బర్ లో ఉన్న సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించారని కేసు నమోదు అయ్యింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐటి విచారణ చేసింది.
ఎస్ఐటి సినియర్ అధికారి చరణ్ రెడ్డి త్వరలోనే గాలి జనార్దన్ రెడ్డి ని విచారణ చేసే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఇప్పటికే అక్రమంగా ఇనుప ఖనిజం తరలించారని గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.