విలన్ల జలసమాధికి హీరో విజయ్ కారణం !
బెంగళూరు: మాస్తిగుడి సినిమా విలన్లు అనీల్, ఉదయ్ జలసమాధి కావడానికి ఆ సినిమా హీరో దునియా విజయ్ కారణం. అయనే సినిమా క్లైమాక్స్ ప్లాన్ ఇచ్చాడని ఆ సినిమా నిర్మాత సుందర్. పి. గౌడ పోలీసులకు వాగ్మూలం ఇచ్చారని వెలుగు చూసింది.
తిప్పగుండనహళ్ళి జలాశయంలోని నిషేదిత ప్రాంతంలో షూటింగ్ చెయ్యరాదని జలమండలి అధికారులు ముందుగా సూచించినా ఎందుకు ఆ ప్రాంతంలో చిత్రీకరణ చేశారు అని తావరకెరె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే రెండు రోజుల క్రితం అరెస్టు అయిన మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్. పి. గౌడ పోలీసుల విచారణలో బాంబు పేల్చాడని పోలీసు వర్గాలు అంటున్నాయి. క్లైమాక్స్ ఎలా తియ్యాలి అని దర్శకుడు నాగశేఖర్ ఆలోచిస్తున్న సమయంలో హీరో దునియా విజయ్ ఈ ప్లాన్ ఇచ్చాడని పోలీసుల విచారణలో చెప్పాడని ఓ కన్నడ టీవీ చానల్ ప్రసారం చేసింది.
అంతే కాకుండా డూప్ లు పెడుదాం అని దర్శకుడు చెప్పినా దునియా విజయ్ వినలేదని, మా శిష్యులు (అనీల్, ఉదయ్)లను తాను ఒప్పిస్తానని, రియల్ గా షూటింగ్ చేద్దామని దునియా విజయ్ పట్టుబట్టారని నిర్మాత సుందర్. పి. గౌడ పోలీసుల విచారణలో అంగీకరించాడు.
ఇప్పటికే సినిమా దర్శకుడు నాగశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తాము నీటిలో దూకడానికి భయంగా ఉందని ఉదయ్ చెప్పినప్పుడు నేను ఉన్నాను కదా మీకెందుకు భయం అని దునియా విజయ్ చెప్పాడని నిర్మాత సుందర్. పి. గౌడ పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు.
క్లైమాక్స్ షూటింగ్ జరగక ముందు అనీల్, ఉదయ్ మీడియాతో మాట్లాడుతూ తాము గజ ఈతగాళ్లు కాదని, అయితే దేవుడి మీద భారం వేసి దూకుతున్నామని అన్నారు. రెండు సార్లు బయటకు వచ్చి మూడో సారి బయటకు రాకపోతే మేము ఆదేవుడి దగ్గరకు వెళ్లిపోయామని అర్థం అని మీడియాకు చెప్పారు.
అదే వారి చివరి మాటలు. ఆ ఇద్దరికి చావు గురించి ముందే తెలుసని అందుకే ఇలా మాట్లాడని అర్థం అయ్యింది. అయితే ఇంత జరగటానికి కారణం దునియా విజయ్ అని నిర్మాత సుందర్.పి. గౌడ చెప్పారని కన్నడ టీవీ చానల్ ( చనిపోక ముందు అనీల్, ఉదయ్ లను ఇంటర్వూ తీసిన టీవీ చానల్) వెల్లడించింది.
దునియా విజయ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉందని రెండు రోజుల క్రితం పోలీసు అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిర్మాత సుందర్. పి. గౌడ స్టేట్ మెంట్ తో కేసు ఎలా మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.