2016లో అత్యధికులు చదివిన వార్త ఏదంటే?
2016లో అత్యధికమంది చదివిన వార్త 'రూ.251కే స్మార్ట్ ఫోన్ ' అంటూ రింగింగ్ బెల్స్ కంపెనీ ఆఫర్ కు సంబంధించిన వార్త.
న్యూ ఢిల్లీ: బతుకు బండికి ఇంధనంలాంటిది డబ్బు. అందులోనూ ఒక్కసారిగా దేశంలో పెద్దనోట్లను మోడీ సర్కారు రద్దు చేయడంతో దేశంలో చాలామంది జీవితాలు దారం తెగిన గాలిపటంలా ఊగిసలాడాయి.
2016 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. భారతీయులకు ఒక మర్చిపోలేని అనుభవం. సంవత్సరంలో చివరి రెండు నెలలు దేశమంతా డబ్బు చుట్టూనే తిరిగింది.. డబ్బు గురించే మాట్లాడుకుంది.. డబ్బును గురించి చదివింది కూడా.
ఈ లెక్క ప్రకారం 2016లో అత్యధికమంది చదివిన వార్త నోట్ల రద్దుకు సంబంధించినదే అయి ఉండాలి . కానీ అలా జరగలేదు. అదే ఆశ్చర్యం. ఓ జాతీయ వార్తాసంస్థ ఈ ఏడాది దేశప్రజలు ఎక్కువగా చదివిన ( మోస్ట్ రీడెడ్ ) వార్తల జాబితా తయారు చేసింది.
ఆశ్చర్యంగా నోట్ల రద్దు అందులో మూడో స్థానంలో నిలిచింది. ఇంతకీ 2016లో అత్యధికమంది చదివిన వార్త ఏమిటో తెలుసా? 'రూ.251కే స్మార్ట్ ఫోన్ ' అంటూ రింగింగ్ బెల్స్ కంపెనీ ఆఫర్ కు సంబంధించిన వార్త అత్యధికులు చదివిన వార్తగా నిలిచింది.
ఇక రెండో స్థానంలో ఒలింపిక్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధుకు సంబంధించిన వార్తలు నిలిచింది. వార్నీ.. దేశం మొత్తాన్ని కుదిపేసిన నోట్ల రద్దు వార్తకన్నా మనోళ్ళని చౌకలో సెల్ ఫోన్ ఇస్తామన్న వార్తే ఎక్కువగా ఆకట్టుకుందన్న మాట. పోనీ ఆ లెక్కన ఆ ఫోన్లు అన్నా జనానికి అందాయా అంటే అదీ లేదు. ఇలా ఉంది లోకం తీరు!