చార్ధామ్ యాత్ర ప్రారంభం- పరిమితి విధింపు : గంగోత్రి ఆలయ ద్వారాలతో..!!
ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి ఆలయాలను అధికారులు మంగళవారం తెరిచారు. అయితే చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు చార్ధామ్ యాత్ర నిలిచిపోగా ఈసారి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారని ఉత్తరాఖండ్ అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 11:15 నిమిషాలకు, యమునోత్రి ద్వారాలను మధ్యాహ్నం 12:15 నిమిషాలకు తెరిచారు.
అనంతరం అమ్మవార్ల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పూజారులు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి సతీసమేతంగా గంగోత్రి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే గంగోత్రికి రోజుకు 7వేల మందిని, యమునోత్రికి రోజుకు 4వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కేదార్నాథ్ ఆలయాన్ని ఈనెల 6న, బద్రినాథ్ ఆలయాన్ని ఈనెల 8న తెరవనున్నారు. కేదార్నాథ్ ఆలయ దర్శనానికి రోజుకు 12వేలు మందిని, బద్రినాథ్కు 15 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్ర యాత్రికువచ్చే భక్తులందరూ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పోర్టల్లో నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు. మే నెల నుంచి అక్టోబర్ వరకు కేదార్నాథ్ ఆలయం తెరిచి ఉంటుంది. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు గుప్త్ కాశీ మరియు సోన్ ప్రయాగ్ లోని వైద్య కేంద్రాల వద్ద హెల్త్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. భక్తుల రక్తపోటును, ఇతర రుగ్మతలను పరీక్షించి.. ఆరోగ్యం సహకరిస్తేనే వైద్య ధృవీకరణ పత్రం ఇవ్వనున్నారు.