దిమ్మ తిరిగే బంగారు నగలు దిగేసుకున్న జయ, శశికళ
జయలలిత, ఆమె ఇష్టసఖి శశికళ దిమ్మ తిరిగే బంగారు నగలను కలిగి ఉన్నట్లు సుప్రీం కోర్టు తీర్పును బట్టి తెలుస్తోంది. వాటితో పాటు చీరెలు, ఇతరాలు కూడబెట్టినట్లు కూడా తెలిపింది.
న్యూఢిల్లీ: దివంగత నేత జయలలిత, ఆమె ఇష్టసఖి శశికళ దిమ్మ తిరిగే నగలను కూడబెట్టుకున్నట్లు సుప్రీంకోర్టు అచనాలను బట్టి తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికళకు సుమారు 2.51 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు సుప్రీం కోర్టు తన తీర్పులో వెలువరించింది.
వీటితో పాటు, 15.9లక్షల రూపాయల విలువైన చేతి గడియారాలు ఉన్నాయని తెలిపింది. జయలలిత మరణించిన తర్వాత తీర్పు రావటంతో ఆమెపై అన్ని ప్రొసీడింగ్లను నిలుపుదల చేస్తూ శశికళతో పాటు మరో ఇద్దరు నిందితుల శిక్షను ఖరారు చేసిన తరువాత ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధ్రువీకరించింది.

సుప్రీంకోర్టు 570పేజీల తన తీర్పులో ఆ వివరాలను తెలియజేసింది. ఏ1 నిందితురాలు(జయలలిత) దగ్గర 1991-96 మధ్య కాలంలో 1.30 కోట్ల రూపాయల విలువైన వాహనాలు( ఓ మారుతి కారు, కాంటెస్సా, వాన్లు, జీపులు), 400 కిలోల వెండి ఉన్నట్లు ట్రయల్ కోర్టు పేర్కొంది. వీటితో పాటు జయలలిత ఇతర నిందితుల దగ్గర 92.4 లక్షల రూపాయల విలువైన చీరలు, రెండు లక్షల రూపాయల విలువైన చెప్పులు ఉన్నట్లు ప్రాసిక్యూషన్ చేసిన అభియోగాన్ని ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
నిందితుల బ్యాంకు ఖాతాల్లో రూ.97.47లక్షలు మరో 3.42కోట్ల రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు తీర్పులో పేర్కొంది. నిందితులు పలు కంపెనీల్లోకి డబ్బులు తరలించినట్లు తీర్పులో వెల్లడించారు.
జయలలిత నగల జాబితా ఇదీ..
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన 389 పాదరక్షలు, 914 పట్టుచీరలు, 6,195 ఇతర చీరలు, 2,140 పాత చీరలు, 98 చేతి గడియారాలు, 86 బంగారు ఆభరణాలు (రాళ్లు లేనివి), 26 బంగారు ఆభరణాలు (రాళ్లు కలిగినవి), 41 బంగారు ఆభరణాలు (వైఢూర్యాలు పొదిగినవి), 228 బంగారు ఆభరణాలు (వజ్రాలు పొదిగినవి), 394 బంగారు ఆభరణాలు(గోమేధికం వంటి విలువైన రాళ్లు కలిగినవి), 1,116 కిలోల వెండి వస్తువులు, శశికళకు సొంతమైన 62 బంగారు ఆభరణాలు (రాళ్లు లేనివి), 34 బంగారు ఆభరణాలు (రాళ్లు కలిగినవి) కర్ణాటక హైకోర్టు ట్రెజరీలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications