రూ. కోటి లంచం, హైదరాబాద్లో అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త లో జరిగిన అవినీతి కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం (ఎస్ఐటి) పోలీసు అధికారులు హైదరాబాద్ లో మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఒక కోటి రూపాయలు లంచం డిమాండ్ చేసిన కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు గురువారం రాత్రి హైదరాబాద్ లో నరసింహ రావ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి బెంగళూరు తీసుకు వచ్చారు. లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ కు ఇతను అత్యంత సన్నిహితుడు అని అధికారులు అంటున్నారు.
బెంగళూరు నగర జిల్లా పంచాయితీ కార్యాలయంలో ఇంజనీరుగా పని చేస్తున్న కృష్ణమూర్తిని బెదిరించి రూ. కోటి లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణమూర్తి ఫిర్యాదు చేసిన కేసులోనే హైదరాబాద్ నివాసి నరసింహ రావ్ ను అరెస్టు చేశారు.
అశ్విన్ రావ్, నరసింహ రావ్ అత్యంత సన్నిహితులు. వీరిద్దరు అనేక సార్లు బెంగళూరు వచ్చి వెళ్లారని అధికారులు ఆదారాలు సేకరించారు. నరసింహ రావ్ ను లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచి న్యాయమూర్తి అనుమతితో అదుపులోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
లోకాయుక్త అవినీతి కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు. లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్, సయ్యద్ రియాజ్, హెచ్.ఎస్. రాజశేఖర్, అశోక్ కుమార్, శ్రీనివాస్ గౌడ, వి. భాస్కర్, మహమ్మద్ సాధిక్, ఎన్. నరసింహ మూర్తి, నరసింహ రావ్ అరెస్టు అయ్యారు.