మరక మంచిది కాదు..! కడిగేసుకుని పునీతులయ్యేందుకు కసరత్తు చేస్తున్న మోదీ, అమీత్ షా..!!
ఢిల్లీ/హైదరాబాద్ : అంచనాలకు మించి..ఊహలకు ఏ మాత్రం అందని రీతిలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు మోడీషాలు. గెలుపు క్రెడిట్ పార్టీకి వెళ్లినా.. అంతా తామై నడిపించిన మోడీషాలదే తాజా విజయమని చెప్పటంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు.అయితే.. తాజాగా ముగిసిన ఎన్నికల పుణ్యమా అని మోడీషాలకు మీద పడిన మచ్చ వారిని తెగ ఇబ్బందికి గురి చేస్తోంది. రెండో దఫా విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ.. సీనియర్లను పక్కన పెట్టేసి.. చేతులు దులుపుకున్నారన్న చెడ్డ పేరు మాత్రం మోడీ-షాలను వెంటాడుతోంది. బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ.. మురళీమోహన్ జోషిలాంటి వారి మొదలు సుమిత్రా మహాజన్ లాంటి వారిని వయసు పేరు చెప్పి పక్కన పెట్టేశారన్న విమర్శలు తారా స్థాయిలో చెలరేగుతున్నాయి.
మచ్చను చెరిపేసుకునేందుకు మోడీషాల తాజా ప్లాన్.! వారికి పార్టీలో సముచిత స్థానం..!!
ఇక.. విదేశాంగ మంత్రిగా మంచి పేరు సంపాదించుకున్న చిన్నమ్మ సుష్మా స్వరాజ్ మాత్రం తాను పోటీ చేయనని గతంలోనే స్పష్టం చేయటం తెలిసిందే. సీనియర్లను పక్కన పెట్టేసి.. పార్టీ మొత్తాన్ని తామే ఏలేస్తున్నామన్న మరకను తుడుచుకునే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. తమపైన వచ్చిన విమర్శల్లో పస లేదన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు మోడీ ఈ మధ్యన నష్టనివారణ చర్యల్ని చేపట్టటం కనిపిస్తుంది. తాను రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు అద్వానీ.. జోషి లాంటి వారిని కలిసి.. వారి ఆశీస్సులు తీసుకోవటం ద్వారా.. సీనియర్లను తాము పక్కన పెట్టేయలేదన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రత్యక్ష ఎన్నికల బరిలో పక్కన పెట్టేసిన సీనియర్ నేతల్ని రాజ్యసభకు ఎంపిక చేయటం ద్వారా.. తమకొచ్చిన చెడ్డపేరును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి.. రాజ్యసభకు ఎంపిక చేస్తామన్న మోడీషాల మాటకు వారెలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్నగా మారిందని చెప్పకతప్పదు.
మరింత పకడ్బందీగా పాలన..! ప్రణాళికలు రచిస్తున్న మోదీ-షా..!!
పెద్ద నోట్ల రద్దు.. జీఎస్టీ అమలు.. గోసంరక్షణ పేరుతో దాడులు.. మైనారిటీలపై దాడులు.. ఇలా నరేంద్రమోదీ అయిదేళ్ల పాలనపై మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో కష్టాలు పెట్టారంటూ విపక్షాలు ఆరోపిస్తుంటాయి. మోదీ పాలనలో ఉద్యోగాలు రాలేదని, రైతులు, సామాన్యులు కష్టాలు పడ్డారని పదేపదే అంటుంటాయి. ఇంత వ్యతిరేక ప్రచారం జరిగినా కూడా మోదీ గతం కంటే మరింత ఎక్కువ మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ప్రధాని పీఠంపై కూర్చున్నారు. అయితే... ఎంతో ముందుచూపు ఉన్న మోదీ, విపక్షాలు చేసే ఈ ప్రచారాలు మొదటి అయిదేళ్ల తన ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతను తేలేకపోయినా కూడా రెండోసారి మరింత జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంలో కనిపిస్తున్నారు.
తొలి క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..! సంక్షేమ పథకాలపై దృష్టి..!!
ఆ క్రమంలో దేశంలోని వివిధ వర్గాలకు మేలు చేసే, ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మోదీ తన తొలి కేబినెట్ భేటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిటైల్ వ్యాపారులకు పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సుమారు 3కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. అలాగే.. దేశంలోని రైతులందరికీ పీఎం కిసాన్ యోజన పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏటా దాదాపు 14.5 కోట్ల మంది రైతులకు 6 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు పింఛను పథకానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పట్టాలెక్క నున్న పాలన..! ముందున్నవన్నీ అచ్చే దిన్ లే..!!
ఉగ్రదాడులు, నక్సల్స్ దాడుల్లో అమరులైన జవాన్ల పిల్లలకు నెలనెలా భారత రక్షణ నిధి నుంచి ఇచ్చే ఉపకార వేతనాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. బాలురకు నెలకు ఇచ్చే రూ.2వేల ఉపకారవేతనాన్ని రూ.2500లకు పెంచారు. అలాగే, బాలికలకు ఇచ్చే 2250 రూపాయలను 3వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటివరకు కేంద్ర, పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన్న ఈ ఉపకార వేతనాలను ఇకపై రాష్ట్రాలకూ విస్తరించాలని నిర్ణయించారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారిని ఎంపిక చేయనున్నారు. హోంమంత్రి అమిత్షా సహా 24మంది కేబినెట్ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్న ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. జూన్ 17 నుంచి జులై 26 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 19న స్పీకర్ను ఎన్నుకోనున్నారు.