పంజాబ్ కింగ్ ఎవరు - ఒకే విడతలో పోలింగ్ : పొత్తులు - ఎత్తులు..!!
సార్వత్రిక సమయంలో సెమీ ఫైనల్స్ కు నగారా మోగింది. దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ సారి ఉత్తర ప్రదేశ్ తో పాటుగా పంజాబ్ పోల్ పైన ఆసక్తి నెలకొని ఉంది. కొద్ది నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పోలింగ్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు ఉన్న పంజాబ్ అసెంబ్లీకి ఈ ఏడాది మార్చి 27తో కాల పరమితి ముగియనుంది.
పంజాబ్ ఎణ్నికలకు సంబంధించి మొత్తం ప్రక్రియ ఒకే విడతలో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. మార్చి 10, 2022 న కౌంటింగ్ చేపట్టనున్నారు. 2017 లో జరిగిన ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ 117 స్థానాల్లో 77 గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిత్రపక్షం అకాలీదల్ తో కలిసి బీజేపీ కేవలం 18 సీట్లు గెలుచుకోగా, శిరోమణీ దళ్ అకాలీ దల్ 15 స్థానాలు - బీజేపీ మూడు స్థానాలు గెలుచుకుంది. ఆప్ పంజాబ్ లో బలం చాటుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ లో సిద్దూ మితిమీరిన జోక్యం.. పీసీసీ చీఫ్ గా సీఎం అమరీందర్ ప్రభుత్వ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోవటంతో అమరీందర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు.

కాంగ్రెస్ ను వీడారు. అమరీందర్ రాష్ట్రంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. బీజేపీ తో పాటుగా శిరోమణీ అకాలీ దల్ (సంయుక్త్)తో ఆయన పొత్తు తో పోటీ చేయనున్నారు. ఇక, కాంగ్రెస్ గెలుపు బాధ్యతలు నూతన సీఎం చన్నీతో పాటుగా పీసీసీ చీఫ్ సిద్దూ పైనే ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న శిరోమణీ అకాలీ దల్ ఈ సారి బీఎస్పీతో జత కట్టనుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ లో ముందుండి పార్టీని నడిపించే బాధ్యత తీసుకున్నారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపీ భగవంత్ మన్ పేరు ప్రచారంలో ఉంది. అయితే, పార్టీ మాత్రం అధికారికంగా పార్టీ ప్రకటించలేదు. ఇక, తాజాగా ప్రధాని భద్రతకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. తాజాగా డీజీపీని సైతం మార్చారు.












Click it and Unblock the Notifications