To day in Parliament : నేటితో ముగియనున్న సమావేశాలు- ఆందోళన వీడని విపక్షాలు : మెట్టు దిగని ప్రభుత్వం..!!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజుగో ముగిసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి రేపటి ( గురువారం) వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నా.. ఉభయ సభల్లో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజుతో సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ప్రధాన పార్టీల్లో అయిదు రాష్ట్రాల ఎన్నికల పైన ఫోకస్ ఎక్కువగా ఉండటం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. అయితే, ఈ సమావేశాల ప్రారంభం నుంచి రాజ్యసభలో గత సమావేశాల్లో అనుచిత ప్రవర్తన కారణంగా 12 మంది..తాజాగా, మరో సభ్యుడి సస్పెన్షన్ తో 13 మంది సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి.
సభ్యుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఛైర్మన్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఇదే అంశం ప్రతీ రోజు రాజ్యసభలో గందర గోళానికి కారణమవుతోంది. ఇక, ఈ రోజు సభలో ప్రశ్నోత్తరాల తరువాత మంత్రులు తమకు సంబంధించిన శాఖల పేపర్లను సభ ముందు ఉంచనున్నారు. అదే విధంగా స్టాండింగ్ కమిటీల నివేదికలను సభకు సమర్పిస్తారు. ఇక, ధరల పెరుగుదల పైన ప్రొఫెసర్ సుగతా రాయ్ చర్చ చేపట్టనున్నారు.

కానీ, సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వివిధ ప్రతిపక్ష పార్టీల నేతల ఆందోళన ఈ రోజు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. విపక్ష పార్టీల నేతలు మంగళవారం పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకూ పాదయాత్ర నిర్వహించారు.లఖీంపూర్ ఖేరి ఘటనలో ఆయనపైన సిట్ తేల్చిన అంశాల ఆధారంగా ఆయన్ను తప్పించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అజయ్ మిశ్రాపై పైన సభలో రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇక, ఈ రోజు సమావేశాలు ముగిసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న సమయంలో..షెడ్యూల్ ప్రకారం రేపు కూడా సభ నిర్వహిస్తారా..లేక, ఈ రోజుతో ముగించేస్తారా అనేది మరి కాసేపట్లో తేలనుంది.












Click it and Unblock the Notifications