ఏపీలో ప్రమాదకర మ్యూటెంట్ విస్తరణ అవాస్తవం, ఆక్సిజన్ కొరత లేదు : ఏకే సింఘాల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ తెలిపారు. అంతేగాక, రాష్ట్రంలో మ్యూటెంట్ విస్తరణ కథనాలు అవాస్తవమన్నారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయొద్దని సింఘాల్ విజ్ఞప్తి చేశారు.
ఏపీలో ప్రమాదకరమైన మ్యూటెంట్ విస్తరణ పేరుతో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ఏకే సింఘాల్ తెలిపారు. స్ట్రెయిన్పై సీసీఎంబీ అధికారికంగా ప్రకటించలేదని స్పష్టం చేశారు. కరోనా రెండో దశలో ఎక్కువ మరణాలు వాస్తవమేనని చెప్పారు. అయితే, కొత్తగా స్ట్రెయిన్ వల్లే మరణాలు అనేది సరికాదన్నారు.

కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనుంది. ఉదయం 6-12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంటుందని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ఏకే సింఘాల్ తెలిపారు. రెండువారాలపాటు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
ప్రస్తుతం ఏపీలో 599 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స జరుగుతోందని, 82 కరోనా కేర్ సెంటర్స్
ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, ఇప్పటి వరకు 447 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామన్నారు. 13,655 మంది కరోనా కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆక్సిజన్ సరఫరా కోసం ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడుతున్నామని, కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లను పెంచుతున్నామని తెలిపారు.
ఏపీలో కొత్తగా 23,920 కరోనా కేసులు, 83 మరణాలు
గడిచిన 24 గంటల వ్యవధిలో 1,15,275 నమూనాలను పరీక్షించగా.. 18,972 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 18,972 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,63,994కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 71 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9 మంది చొప్పున కరోనాతో మరణించగా, అనంతపురం, కర్నూలులో ఏడుగురు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో మరణించారు. తాజా మరణాలతో ఇప్పటి వరకు నమోదైన మరణాలు సంఖ్య 8207కు చేరింది.
Recommended Video
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,227 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 10,03,935కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,51,852 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,67,18,148 కరోనా నమూనాలను పరీక్షించారు.












Click it and Unblock the Notifications