కేజ్రీవాల్పై బాంబు పేల్చిన ప్రశాంత్ భూషణ్, ప్రశ్నిస్తే ఇష్టపడడు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ప్రశాంత్ భూషణ్ శుక్రవారం నాడు బాంబు పేల్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, తమ పార్టీ సీనియర్ నేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారని, అప్పటి నుండే పార్టీలో విభేదాలు తలెత్తాయని అన్నారు. తనను ప్రశ్నించే వారంటే కేజ్రీవాల్ ఇష్టపడరన్నారు.
తమను రాజీనామా చేయాలని పార్టీ కోరిందన్నారు. కేజ్రీవాల్ తన సొంత అభిప్రాయాలను తమ పైన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ డిక్టేటర్ అని మండిపడ్డారు. ఏఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. కేజ్రీవాల్లో ఎన్నో వీక్నెస్లు ఉన్నాయన్నారు. అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రశాంత్ భూషణ్ తొలిసారిగా మీడియాకు ఎక్కడం గమనార్హం.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లను పార్టీ నుండి బహిష్కరించే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. పార్టీ నుండి బహిష్కరించే కంటే ముందే.. రాజీనామా చేయాలని మరో సీనియర్ నేత అశుతోష్ యోగేంద్ర, భూషణ్లకు సలహా ఇచ్చారంటున్నారు.
జాతీయ కార్యవర్గం నుండి రాజీనామా చేయాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ వర్గం తమను బలవంతం చేస్తోందని, తమ సూచనలు వేటినీ కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని యోగేంద్ర, భూషణ్లు గురువారం ఆరోపించారు.
శనివారం జాతీయ కార్యవర్గం భేటీ నిర్వహించనన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కేజ్రీవాల్కు బహిరంగ లేఖ రాశారు. రాజీనామా చేయాలని లేదా జాతీయ కార్యవర్గం నుండి తొలగింపుకు సిద్ధం కావాలని రాజీ చర్చల్లో కేజ్రీవాల్ తఱఫున హాజరైన వారు తమను హెచ్చరించారని ఆరోపించారు.