మోడీ ఐతే ఢిల్లీ ఏది: నితీష్, జీర్ణించుకోలేకపోతున్న షీలా
పాట్నా/న్యూఢిల్లీ: 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత మాత్రమే వ్యక్తమైందని, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆకర్షణ ఏ మాత్రం పనిచేయలేదని బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీష్ కుమార్ సోమవారం అన్నారు. మోడీ మంత్రం నిజంగా పని చేసి ఉంటే బిజెపికి ఢిల్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వచ్చి ఉండేదని ఆయన అన్నారు.
తాజా ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్పై ఆగ్రహం ప్రకటించారన్న విషయంలో ఎలాంటి వివాదానికి తావు లేదని, అయితే ఇదంతా తమ మహిమే అని బిజెపి నాయకులు సంబర పడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్పై వ్యతిరేకత వల్లే బిజెపి నాలుగు రాష్ట్రాల్లో లాభపడిందన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బిజెపి హవా ఇలాగే ఉంటుందని తాను భావించడం లేదన్నారు.
ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించి బిజెపి చేసిన ప్రయోగం ఆదిలోనే వికటించినట్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నితీష్ అన్నారు. చత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల్లో కాంగ్రెస్కు మరో ప్రత్యామ్నాయం లేనందునే ఓటర్లు బిజెపిని గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఉన్నందునే ఆమ్ ఆద్మీ పార్టీని జనం ఆదరించారన్నారు. ఢిల్లీలో ఎదురైన చేదు అనుభవాన్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి చవిచూడక తప్పదన్నారు.
కలలను అమ్మారు: షీలా
ఆమ్ ఆద్మి పార్టీ ప్రజలకు కలలను అమ్మిందని షీలా దీక్షిత్ విమర్శించారు. సోమవారం షీలా మీడియాతో మాట్లాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తామంటూ ఆప్, బిజెపిలు ప్రజలను మభ్యపెట్టాయన్నారు. కాగా, కేజ్రీవాల్ చేతిలో ఆమె స్వయంగా ఓటమిని చవిచూడటం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారట. కలలను రూపొందించలేరని, అదేవిధంగా వాటిని అమ్మలేరని, అయితే ఆ రెండు పార్టీలు కలల్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు.