ఫలితాల తరువాత కేంద్రంలో జగన్ మద్దతు ఎవరికి ? టార్గెట్ చంద్రబాబుగా ఈక్వేషన్స్ మారుతాయా ?
దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం బాగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడు విడతలు ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ సరళిని నేతలు పరిశీలించి ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే ఈ సారి కేంద్రంలో మాత్రం ఏ ప్రభుత్వం వస్తుందనేది మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. దీంతో జాతీయ పార్టీలు ప్రాంతీయపార్టీల వైపు చూస్తున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్న ప్రాంతీయ పార్టీలు
దేశంలో ఎన్నికల వేడీ తారాస్థాయికి చేరుకుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టమైన అంచనాలు ఎక్కడా రాలేదు. ఓ వైపు బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అని విపక్షాలు సంబరపడుతున్న క్రమంలో కొన్ని అంశాలు మోడీకి కలిసొచ్చాయని అధికార బీజేపీ భావిస్తోంది. ఇందులో ముఖ్యంగా పాక్పై జరిగిన మెరుపుదాడులు. వాస్తవ పరిస్థితులను చూస్తే కేంద్రంలో ఏ పార్టీకి సొంతంగా మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ఉత్తరం, తూర్పు, దక్షిణ భారతం నుంచి ఆరుగురు ప్రాంతీయ పార్టీల నేతలు కీలకం కానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ మాయవతి, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, ఒడిషా నుంచి నవీన్ పట్నాయక్, తెలంగాణ నుంచి కేసీఆర్, ఏపీ నుంచి వైయస్ జగన్లు మొత్తం లోక్సభ స్థానాల్లో కనీసం 20శాతం స్థానాలు వీరిసొంతం అవుతాయని అంచనా.
ప్రాంతీయ పార్టీలకు దక్కే సీట్లు ఇలా ఉన్నాయి
ప్రస్తుత సమీకరణాలు చూస్తే కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డిల పార్టీలు రెండు కలిపి 30 నుంచి 35 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది.అంతేకాదు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇద్దరు కలిసే ఒక నిర్ణయంపై నడుస్తారనే సంకేతాలు ఇప్పటికే బయటకొచ్చాయి. ఇక ఒడిషాలో మొత్తం 21లోక్సభ స్థానాలకు గాను నవీన్ పట్నాయక్ పార్టీకి ఎంత లేదన్న 14 నుంచి 15 స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా రెండు కీలక రాష్ట్రాలను పరిశీలిస్తే బెంగాల్లో తృణమూల్ పార్టీకి బీజేపీ నుంచి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. అయితే బీజేపీ గతంలో కంటే కాస్త మెరుగ్గానే బెంగాల్లో సీట్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం మొత్తం 42 సీట్లకు గాను మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్కు 34 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఉత్తర్ప్రదేశ్ సమీకరణాలు పరిశీలిస్తే అఖిలేష్ యాదవ్ మమతా కాంబినేషన్కు కనీసం 40 స్థానాలు లేదా అంతకంటే ఎక్కువే దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
హంగ్ వస్తే జగన్ కేసీఆర్ మద్దుత ఎవరికీ..?
ఒకవేళ హంగ్ పార్లమెంట్ వస్తే కేంద్రంలో ఎన్డీఏ కానీ యూపీఏ కానీ ఈ ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వస్తుంది. అంటే ఈ పార్టీలు ఏ మేరకు డిమాండ్ చేస్తే వాటన్నిటికి కాదనకుండా తలఊపాల్సిందే. ఇందుకు రెండు జాతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసీఆర్, జగన్ ఇద్దరూ తమ రాష్ట్రాలకు నెరవేర్చాల్సిన హామీలు ఎవరైతే నెరవేరుస్తామని పక్కాగా హామీ ఇస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే క్లారిఫై చేశారు. ఒకవేళ హంగ్ పార్లమెంట్ పరిస్తితే వస్తే కాంగ్రెస్కు మద్దతు ఇస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే స్థానిక సమీకరణాల ప్రకారం ఇటు జగన్ అటు కేసీఆర్ ఇద్దరూ చంద్రబాబుపై పోరాటం చేస్తున్నవారే. మరి చంద్రబాబు కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్న సమయంలో వీరు కచ్చితంగా ఎన్డీయే వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇక నవీన్ పట్నాయక్ ఎప్పటిలానే తన వెర్షన్ ఇంకా బయటపెట్టలేదు. ఇక యూపీలో ఎస్పీ సమాజ్ వాదీ పార్టీలు సమయం వచ్చినప్పుడే స్పందించేలా కనిపిస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీల ముందు మూడు ఆప్షన్స్
ఇక ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారు అనేదానిపై ఈ ఆరుగురు ముఖ్యనేతలు ఒక అభిప్రాయానికి వస్తే ఇబ్బంది ఉండదు. అంతేకాదు ఆ తర్వాత ఎంతవరకు మేనేజ్ చేస్తారనేది కూడా ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. గత కొన్ని నెలలుగా కేంద్రంలో గుణాత్మకమైన మార్పు రావాలంటూ అది ఫెడరల్ ఫ్రంట్ వల్లే సాధ్యమవుతుందని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. బీజేపీ కాంగ్రెసేతర పార్టీలతోనే దేశం అభివృద్ధిపథంలో నడుస్తుందని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈక్వేషన్స్
ఎలా
ఉంటాయి
*
ప్రభుత్వ
ఏర్పాటుకు
ఎన్డీఏకే
మెరుగైన
అవకాశాలు
కనిపిస్తే
ఈ
ఆరుగురు
పార్టీనేతల్లో
ఎక్కవ
మంది
ఎన్డీయేకే
మద్దతు
ఇచ్చే
అవకాశాలు
మెండుగా
కనిపిస్తున్నాయి.
* ఒకవేళ బీజేపీ సొంతంగా 200 స్థానాలు రాకపోతే వీరంతా బీజేపీని అధికారంలోకి రాకుండా యూపీఏకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
* ఈ ఆరుగురు ఒక ఫ్రంట్గా ఏర్పడి...జాతీయ స్థాయిలో మరో పెద్ద పార్టీ (కాంగ్రెస్)మద్దతు కోరితే 1990 నాటి పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి.