‘జమిలి’పై స్పందించిన విజయ్: ఏమన్నారంటే?
చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'జమిలి' ఎన్నికల ప్రతిపాదనను ప్రముఖ సినీనటుడు, తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే దేశం - ఒకే ఎన్నికను అమలు చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, అందుకే ఈ చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు.
తన పార్టీ జిల్లా ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులతో ఆదివారం తొలిసారి సమావేశం నిర్వహించారు విజయ్. ఈ సందర్భంగా టీవీకేని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజలకు చేరువయ్యే అంశాలపై ప్రధానంగా చర్చించి 26 తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విజయ్ విమర్శలు గుప్పించారు.

తమిళనాడులో కులగణన చేపట్టాలని విజయ్ కోరారు. పరందూర్ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిర్దేశిత గడువు నిర్దేశించుకుని మద్యం దుకాణాలను మూసివేయాలని డీఎంకే ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ రివ్యూలో ఉన్న వక్స్ సవరణ బిల్లు-2024ను ఫెడరలిజంపై దాడిని వ్యాఖ్యానించారు. ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, నీట్ను చేయాలన్న డిమాండ్ కు విజయ్ మద్దతు ప్రకటించారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి మార్చాలని కోరారు. తమిళనాడు ప్రజల సామరస్యత, ఐక్యత కోసం పనిచేసే తమ పార్టీ సిద్ధాంతం లౌకికవాదం, సామాజిక న్యాయమేనని విజయ్ అన్నారు. టీవీకే పార్టీ స్థాపించిన విజయ్.. ఇటీవలే పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. తాము రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ.. చిన్న పిల్లలం కాదని ఘాటుగా స్పందించారు. ఆ బహిరంగ సభలో కూడా ఆయన బీజేపీ, డీఎంకే పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాగా, తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ పార్టీ సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications