చెన్నైలో భారీ వర్షాలు అంటూ సోషల్ మీడియా పుకార్లు
చెన్నై: భారీ వర్షాలు, వరదల కారణంగా అల్లకల్లోలంగా మారిన చెన్నై నగరంలోని ప్రజలను కొందరు సోషల్ మీడియా ద్వారా బయపెడుతున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ చెన్నై ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
రాబోయే మూడు నాలుగు రోజుల పాటు చెన్నై నగరంలో భారీ వర్షాలు పడుతాయంటూ నాసా హెచ్చరించిందని కొందరు వాట్సప్ లో ఓ సందేశం పంపించారు. ఈ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అనేక గ్రూప్ లు షేర్ చేశాయి. అయితే నాసా ఎలాంటి హెచ్చరికలు జారీ చెయ్యలేదని, చెన్నైలో ప్రస్తుతం ఎలాంటి వర్షం పడలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు నమ్మరాదని అధికారులు మనవి చేస్తున్నారు.
భారతదేశంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా 250 సెంటీమీటర్ల వర్షం పడుతుందని ఆ సందేశంలో ఉంది. ఇలాంటి తప్పుడు సందేశాలను ఎవ్వరికి పంపించరాదని అధికారులు సూచించారు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు చాల మంది సెలవులు పెట్టి అన్ని చక్కదిద్దుకున్న తరువాత చెన్నై వెళ్లాలని నిర్ణయించారు.
ఇప్పుడు ఇలాంటి పుకార్లు పుట్టించి సోషల్ మీడియా ద్వారా అందరిని ఆందోళనకు గురి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. మంగళవారం చెన్నై నగరంలో ఎలాంటి వర్షం పడలేదని, రాబోయే నాలుగు రోజుల్లో ఎలాంటి వర్షాలు రావని అధికారులు తెలిపారు.