లాయర్ ఇంట్లో రూ.157కోట్లు.. రెండున్నర కోట్లు కొత్త నోట్లే!
రోహిత్ టాండన్ అనే ఓ న్యాయవాది వద్ద రూ.157కోట్ల నల్లధనాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఇందులో రెండున్నర కోట్లు కొత్త నోట్లు కావడం గమనార్హం.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఓవైపు సామాన్యులంతా కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే.. బడాబాబులకు మాత్రం కోట్ల రూపాయల కరెన్సీ నేరుగా ఇంటికే చేరిపోతుంది. టీటీడీ శేఖర్ రెడ్డి ఇంట్లో కోట్ల రూపాయల కొత్త కరెన్సీ బాగోతం మరిచిపోకముందే.. ఓ న్యాయవాది దగ్గర ఏకంగా రూ.2.61కోట్ల కొత్త కరెన్సీ నోట్లు బయటపడ్డాయి.
సదరు న్యాయవాది పేరు రోహిత్ టాండన్ కాగా.. అతనేమి పేరు మోసిన న్యాయవాది కూడా కాదు. సుప్రీం కోర్టు సంగతి అటుంచితే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ లో కూడా అతన్ని అంతగా గుర్తుపట్టే పరిస్థితి లేదు. అలాంటి ఓ సాధారణ వ్యక్తి వద్దకి ఇంత భారీ మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిపడిందన్నది బ్యాంకుల పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఐటీతో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారుల సంయుక్త దాడుల్లో భాగంగా రోహిత్ టాండన్ ఇంట్లో ఉన్న ఈ భారీ కొత్త నోట్ల నగదు బయటపడింది. మొత్తం మూడుసార్లు రోహిత్ టాండన్ ఇంటిపై దాడులు చేసిన అధికారులు.. రూ.157కోట్లను ఆయన ఇంట్లో గుర్తించినట్టు తెలుస్తోంది. తాజాగా చేసిన దాడిలో రూ.13.5కోట్లు బయటపడగా.. అందులో పాత నోట్లు పోను కొత్త నోట్ల కరెన్సీ రూ2.61కోట్లు ఉన్నట్టుగా తేలింది.
రోహిత్ టాండన్ పై గత రెండు నెలలుగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిఘా పెట్టి ఉంచినట్టుగా తెలుస్తోంది. బయటపడ్డ డబ్బుకు సంబంధించి రోహిత్ టాండన్ వద్ద ఎలాంటి లెక్కా పత్రాలు లేకపోవడం గమనార్హం.