Delta Plus Variant : ఇప్పటికైతే ఆధారాల్లేవ్.. డెల్టా ప్లస్తో థర్డ్ వేవ్ ముప్పుపై టాప్ డాక్టర్...
భారత్లో డెల్టా ప్లస్ వేరియంట్తో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా అన్న దానిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూడటంతో థర్డ్ వేవ్ వస్తుందేమోనన్న ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన టాప్ డాక్టర్,జన్యు విశ్లేషకుడు డా.అనురాగ్ అగర్వాల్ దీనిపై స్పందించారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ)కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న డా.అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ... ఇప్పటికైతే డెల్టా ప్లస్ వేరియంట్తో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఏప్రిల్,మే,జూన్ నెలల్లో ఐజీఐబీ ద్వారా మహారాష్ట్రకు చెందిన 3500 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పారు. ఇందులో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఒక శాతానికి మించలేదన్నారు.
థర్డ్ వేవ్ గురించి ఆందోళన చెందే ముందు నిజానికి ఇప్పటికీ ఇంకా సెకండ్ వేవ్ ముగియలేదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. థర్డ్ వేవ్ గురించి ప్రజలు అంతగా భయాందోళన చెందాల్సిన కారణాలైతే ఏమీ కనిపించట్లేదన్నారు. ఇప్పటికైతే థర్డ్ వేవ్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవన్నారు.
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 40 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర,కేరళ,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. దేశంలో సెకండ్ వేవ్ ఉధృతికి డెల్టా వేరియంటే కారణమన్న ప్రచారం ఉండటంతో... డెల్టా ప్లస్ వేరియంట్తో థర్డ్ వేవ్ తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని సైతం తట్టుకోగలదేమోనన్న వాదన వినిపిస్తోంది. అయితే డెల్టా ప్లస్ వేరియంట్కి సంబంధించి వినిపిస్తున్న వాటిల్లో ఎక్కువ శాతం ఊహాగానాలే తప్ప కచ్చితమైన,శాస్త్రీయమైన సమాచారమేదీ ఇప్పటికైతే అందుబాటులో లేదు. కాబట్టి డెల్టా ప్లస్ వేరియంట్తో థర్డ్ వేవ్ ముప్పు అనేది ఇప్పటికైతే ఊహాగానమే అని చెప్పవచ్చు.
డెల్టా ప్లస్ వేరియంట్ లేదా AY.01గా పరిగణిస్తున్న వేరియంట్లోని స్పైక్ ప్రోటీన్ K417N అనే మ్యుటేషన్ను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన మొదటి సీక్వెన్స్ను మార్చి,2021లో యూరోప్లో గుర్తించారు.