ఫ్యాన్ కూడా లేని గదిలో: జైల్లో ఇంద్రాణి ఇలా..!
న్యూఢిల్లీ: షీనా బోరా హత్య కేసులో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా వెలుగులొకి వచ్చింది ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా. ఒకప్పుడు అల్ట్రా మోడ్రన్ జీవితాన్ని అనుభవించిన ఇంద్రాణి ఇప్పుడు జైల్లో ఉన్నారు. కన్న కూతురిని హత్య చేసిన కేసుకు సంబంధించి ఆమెను ముంబై జైల్లో ఉంచారు.
జైలు అధికారులు ఆమెను సాధారణ ఖైదీగానే చూస్తున్నారు. జైల్లో ఆమెకు పడుకోవడానికి ఒక చాపను మాత్రమే ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆమె ఉన్న గదిలో ఫ్యాన్ కూడా లేదు. కేవలం ఒక్క కిటికీ మాత్రమే ఉందని, అది కూడా చాలా ఎత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఉదయం పూట టిఫిన్గా వడా పావ్, టీలను ఆమెకు ఇస్తున్నారు. ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని ఆమెకు ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరించారు. ఆ ఆహారంలో విషం కలిపే అనుమానాలు తమకున్నాయని జైలు అధికారులు స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉంటే, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా సమక్షంలో ఆమెతో సహా ఇతర నిందితులను విచారించారు. ఈరోజు కూడా మళ్లీ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. పీటర్ స్వగృహంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి చేపట్టిన దర్యాప్తు, విచారణలో భాగంగా నిన్న ఆయనను 12 గంటల పాటు ప్రశ్నించి, కొన్ని విషయాలను రాబట్టిన సంగతి తెలిసిందే. కలినాలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ కేసుకు సంబంధించి లభ్యమైన ఆధారాలను వారు పరిశీలిస్తున్నారు. కన్న కూతుర్ని హత్య చేసిందన్న ఆరోపణలతో ఇంద్రాణీ ముఖర్జియా ఆగస్టు 25న అరెస్టయిన విషయం విదితమే.