టీకా కోటాకు కేంద్రం కొర్రీలు- వ్యాక్సినేషన్ రికార్డే ఆధారం-గత వృథా కూడా లెక్కే
మే 1 నుంచి దేశవ్యాప్తంగా మూడో విడత కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త విధానాన్ని సైతం సిద్దం చేసుకుంది. దీని ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ కోటాలను కూడా నిర్ణయించబోతోంది. ఈసారి అన్ని రాష్ట్రాలకు సమానంగా టీకా ఇచ్చే అవకాశాలు లేవని కేంద్రం తేల్చేసింది. కొన్ని ప్రామాణికాలను నిర్ణయించి వాటి ఆధారంగానే ఆయా రాష్ట్రాలకు టీకాను ఇస్తామని ప్రకటించింది. ఇందులో గతంలో ఆయా రాష్టాలు చేసిన వ్యాక్సిన్ల వృథా కూడా ఉండటం కలవరపెడుతోంది. దీంతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కూడా వివాదాస్పదమవుతోంది.
రాష్టాలకు ఇచ్చే టీకా కోటాలోమార్పులు
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు అక్కడి కేసుల సంఖ్య, కోవిడ్ వ్యాప్తితో పాటు పలు అంశాల ఆధారంగా ఉచితంగా టీకాలు పంపుతోంది. కానీ మే 1 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. దీని ప్రకారం మే 1 నుంచి ప్రారంభమయ్యే మూడో విడత టీకాల పంపిణీలో 18 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు ఉచితంగా ఇచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో పాటు పలు కొత్త నిబందనలను కూడా పెడుతోంది. గత రికార్డు ఆధారంగా రాష్టాలకు టీకా కోటా పంపిణీ చేస్తామని చెబుతోంది.
టీకా కోటాలో ప్రామాణికాలివే
రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే టీకా కోటాలో ఈసారి పలు ప్రామాణికాలను విధిస్తోంది. వీటి ఆధారంగానే టీకాను ఆయారాష్ట్రాలకు కేంద్రం పంపబోతోంది. ఇందులో ఇప్పటివరకూ రాష్ట్రాలు సాధించిన టీకా కవరేజ్, ఆయా రాష్ట్రాల్లో కేసుల భారం ఎంత, గతంలో చ్చిన వ్యాక్సిన్లను ఎంత మేర వాడారు, ఎన్ని వృథా అయ్యాయన్న అంశాలను ఈసారి కేంద్రం పరిగణనలోకి తీసుకోబోతోంది. దీంతో పలు రాష్టాలు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో టీకా వృథా చేసిన వారికి ఈసారి కట్
గతంలో ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను పూర్తి స్దాయిలో వాడుకోలేక వృథా చేశాయి. ఆయా రాష్ట్రాల్లో టీకాపై పూర్తి అవగాహన లేకపోవడం, టీకా వేయించుకునేందుకు జనం ముందుకు రాకపోవడం వంటి కారణాలతో పలు రాష్టాల్లో టీకా వృథా అయిపోయింది. దీంతో గతంలో అలా టీకా వృథా చేసిన రాష్ట్రాలకు ఈసారి ఇచ్చే టీకాల కోటా ఆ మేరకు తగ్గిపోనుంది. అయితే గతంలో టీకా వృథా చేసి ఇప్పుడు కేసుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కోత పడితే అది మరిన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.
మరో వివాదానికి తెరతీస్తున్న కేంద్రం
మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టేందుకు కేంద్రం ప్రకటించిన విధానంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం రాష్టాలపై భారం మోపి తప్పించుకోవాలని చూస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో గతంలో టీకా వృథా చేశారన్న కారణంతో ఈసారి టీకా కోటాలో కోతలు విధిస్తే విపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందించాలన్న అంశంపై ఇప్పుడు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి.