అత్యాచారం తర్వాత నిద్రపోయావా... భారతీయ మహిళలు అలా ఉండరే...
ఓ అత్యాచార ఆరోపణల కేసులో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు పట్ల అనుమానం వ్యక్తం చేసిన కోర్టు... అత్యాచారం తర్వాత ఆమె వ్యవహరించిన తీరును తప్పు పట్టింది. కోర్టుకు సమర్పించిన వివరణలో.. 'ఆ ఘాతుకం తర్వాత నేను పూర్తిగా అలసిపోయాను... తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.' అని ఆమె పేర్కొంది. అయితే ఈ వివరణలో విశ్వసనీయత లోపించినట్టుగా కోర్టు పరోక్ష వ్యాఖ్యలు చేసింది.

42 ఏళ్ల మహిళపై 27 ఏళ్ల యువకుడు..
బెంగళూరుకు చెందిన రాకేష్ బి(27) అనే యువకుడు 42 ఏళ్ల తన కంపెనీ యజమానిపై అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై బెంగళూరు ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో మే 2న కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 376(రేప్),420(చీటింగ్),506(నేరపూరిత బెదిరింపులు),సెక్షన్ 66-B(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తప్పు పట్టిన కోర్టు...
ఈ కేసు గురువారం(జూన్ 25) విచారణకు రాగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాధితురాలు కోర్టుకు తన వివరణను సమర్పించింది. ఆ ఘటన తర్వాత తాను పూర్తిగా అలసిపోయి.. నిద్రలోకి జారుకున్నానని అందులో పేర్కొంది. అందుకే ఆలస్యంగా ఫిర్యాదు చేశానని తెలిపింది. అయితే న్యాయమూర్తి ఆమె వివరణతో ఏకీభవించలేదు.'అత్యాచారం తర్వాత నిద్రలోకి జారుకోవడమా.. ఇలాంటి ఘాతుకానికి గురైనప్పుడు మన భారతీయ మహిళలు స్పందించే విధానం ఇలా ఉండదు.' అని బాధితురాలి వెర్షన్పై న్యాయమూర్తి కృష్ణమూర్తి దీక్షిత్ పేర్కొన్నారు.

ఆ రాత్రి ఒంటరిగా..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె చేస్తున్న ఆరోపణలు కూడా నమ్మశక్యంగా లేవని న్యాయమూర్తి అన్నారు. అతనితో పాటు రెండేళ్లుగా కలిసి పనిచేస్తున్న ఆమె... గతంలో ఎప్పుడూ అతనిపై ఆరోపణలు చేసిన దాఖలా లేదన్నారు. అసలు ఆరోజు రాత్రి 11గంటలకు అతనితో కలిసి ఒంటరిగా ఆఫీసుకు ఎందుకు వెళ్లిందో ఆమె ఎక్కడా తన వివరణలో పేర్కొనలేదన్నారు. అంతేకాదు,అతనితో కలిసి మద్యం తాగేందుకు కూడా ఆమె అభ్యంతరం చెప్పలేదని... మరుసటిరోజు ఉదయం వరకూ అతనితోనే ఉందని అన్నారు.ఘటన జరిగినప్పుడు ఆమె పోలీసులను గానీ లేక స్థానికులను గానీ ఎవరినీ అప్రమత్తం చేయలేదని న్యాయమూర్తి అన్నారు.

బెయిల్ మంజూరు...
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్కి రూ.1లక్ష పూచీకత్తుపై న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ప్రతీ రెండో,నాలుగో శనివారాల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లి రిపోర్ట్ చేయాలని చెప్పారు. న్యాయస్థానం అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లరాదని చెప్పారు. జైల్లో ఖైదీలకు కోవిడ్ 19 సోకే ప్రమాదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం.












Click it and Unblock the Notifications