కర్ణాటక ఎన్నికలు: ప్రభుత్వ ఏర్పాటును డిసైడ్ చేసేది ఆ సీటే, చరిత్ర పునరావృతమయ్యేనా?
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు మే 12వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ రాష్ట్రంలోని సిరహట్టి అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తే కర్ణాటకలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే విశ్వాసం నెలకోంది. 1972 నుండి కర్ణాటకలో ఇదే ఫలితాలు వస్తున్నాయని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2018 ఎన్నికలు కూడ ఇదే రకమైన చరిత్రను పునరావృతం చేస్తాయా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి మే 12 ఎన్నికలు జరగనున్నాయి మే 15వ తేదిన ఫలితాలు వెలువడుతాయి ఈ ఎన్నికలను కాంగ్రెస్, బిజెపిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. దక్షిణాదిలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది. అయితే తమ ఖాతాలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు గాను కాంగ్రెస్, బిజెపిలకు చెందిన అగ్ర నేతలు విస్తృతంగా పర్యటించారు. తమ తమ పార్టీ విధానాలను ప్రచారం చేశారు. గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

సిరహట్టిపైనే అందరి దృష్టి
కర్ణాటక రాష్ట్రంలోని సిరహట్టి అసెంబ్లీ సెగ్మెంట్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తే కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1972 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఇవే రకమైన ఫలితాలు వస్తున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే 2018 ఎన్నికల్లో కూడ ఇదే రకమైన ఫలితాలు వస్తాయా లేవా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిరహట్టి నుండి తమ పార్టీ అభ్యర్ధులే విజయం సాధించాలని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రెండు ప్రధాన పార్టీలు కోరుకొంటున్నాయి.

సిరహట్టి సీటే కర్ణాటకలో కీలకం
1972 నుండి కర్ణాటక రాష్ట్రంలోని సిరహట్టి సెగ్మెంట్లో ఎవరు విజయం సాధిస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్రంలోని రాజకీయ నేతలు భావిస్తున్నారు. 1972 లో సిరహట్టి నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వదిరాజ్ చార్య గెలుపొందారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవరాజ్ ఉర్స్ 1972లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

1983లో కాంగ్రెస్కు దెబ్బ
1983లో ఈ స్థానం నుండి పకీరప్ప ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పకీరప్ప జనతాపార్టీకి మద్దతు ప్రకటించారు. 1983లో జనతా పార్టీకి చెందిన రామకృష్ణ హెగ్డే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.1985లో సిరహట్టిలో జనతా పార్టీ విజయం సాధించింది. రెండో దఫా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రామకృష్ణ హెగ్డే బాధ్యతలను స్వీకరించారు.

1989లో కాంగ్రెస్దే పీఠం
1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సిరహట్టిలో విజయం సాధించారు. 1989లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకొంది. ఆ పార్టీకి చెందిన వీరేంద్రపాటిల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగడంతో వీరేంద్ర పాటిల్ను ముఖ్యమంత్రి పదవి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తొలగించింది.

1994లో దేవేగౌడ సీఎం గా బాధ్యతలు
1994లో జరిగిన ఎన్నికల్లో సిరహట్టి నుండి స్వతంత్ర అభ్యర్ధి పకీరప్పను జనతాదళ్ అభ్యర్ధి మహానటేశ్వర్ ఓడించారు. 1994లో జనతాదళ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొంది. ఆ సమయంలో జనతాదళ్ నుండి దేవేగౌడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ సిరహట్టి స్థానాన్ని గెలుచుకొంది. ఈ సమయంలో ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 2004లో కొద్ది మెజారిటీతో ఈ స్ధానంలో కాంగ్రెస్ గెలుపొందినా కాంగ్రెస్ మద్దతుతోనే జెడీ(ఎస్)కు చెందిన దేవెగౌడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన కుమారుడు కుమారస్వామి బీజేపీతో చేతులు కలపడం కూటమి ప్రభుత్వం విఫల ప్రయోగంగా నిలిచింది.

దక్షిణాదిలో తొలిసారి బిజెపి సర్కార్
2008లో సిరహట్టి స్థానంలో బిజెపి అభ్యర్థి విజయం సాధించారు. ఆ సమయంలో కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దక్షిణాదిలో తొలిసారిగా ప్రభుత్వాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేసి బిజెపి రికార్డు సృష్టించింది.2013లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సిరహట్టి నుండి విజయం సాధించారు. 2013లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే మే 12 జరిగే ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఎవరు విజయం సాధిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications