సముద్రంలో దూకండి: సూర్య నమస్కారాలు వ్యతిరేకించేవారిపై ఆదిత్యానాథ్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటుసభ్యుడు యోగి ఆదిత్యానాథ్ మంగళవారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు ‘చీకటి గదుల్లో ఉండండి లేదా సముద్రంలో దూకండి' అని అన్నారు. సూర్యుడు ఎవరిపైనా వివక్ష చూపడని అన్నారు.
సూర్య నమస్కారాలను వ్యతిరేకించేవారి జ్ఞానాన్ని చూస్తే నవ్వొస్తుందని అన్నారు. కాగా, జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశ ప్రజలందర్నీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సూర్య నమస్కారాలను తొలగించాలని ఇటీవల నిర్ణయించింది.
సూర్య నమస్కారాల్లో అందరూ తప్పనిసరిగా పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పింది. ముస్లిం సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, సూర్య నమస్కారాలు.. శరీరాన్ని ఉత్తేజభరితంగా చేసే ఒక వ్యాయామం. సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యంగా సిద్ధిస్తుందని యోగా గురువులు చెబుతున్నారు.