అప్పుడు రామ భక్తులపై కాల్పులు, ఇప్పుడు వారిచేతిలో భజరంగభళి గద, త్వరలో కరసేవకులుగా: యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐదో దశ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అధికార బీజేపీ గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, సీఎం యోగి ఆదిత్యనాత్ సహా పలువురు కీలక నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. యూపీలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video
బీజేపీ వచ్చాకే శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి: సీఎం యోగి
శుక్రవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ సుల్తాన్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే లా అండ్ ఆర్డర్ గాడిలో పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపర్చిందన్నారు. గత పాలకుల హయాంలో తుపాకులు పట్టుకుని తిరిగేవారు.. ఇప్పుడు భజరంగభళి గదను పట్టుకున్నారని సమాజ్ వాదీ పార్టీ నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
అప్పుడు రామభక్తులపై కాల్పులు.. ఇప్పుడు వారిచేతిలో భజరంగభళి గద
అంతేగాక, అయోధ్యలో రామ భక్తులపై కాల్పులు జరిపిన అదే ఎస్పీ నేతలు.. ఇప్పుడు భజరంగభళి గదను పట్టుకుని తిరుగుతున్నారని విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కూడా వారు ఓటమిపాలైతే వారంతా కర్ సేవక్లుగా మారిపోతారని యోగి వ్యాఖ్యానించారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కరసేవకులపై కాల్పులు జరపడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా రాష్ట్రం బయటకే: యోగి జోస్యం
చివరి నాలుగు దశల ఎన్నికల ఫలితాలు కూడా మార్చి 10న వస్తాయని.. ఆ తర్వాత మార్చి 11న ప్రతిపక్ష పార్టీల నేతలు రాష్ట్రం నుంచి బయటికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసున్నారని అన్నారు యోగి ఆదిత్యనాథ్. కాగా, సీఎం యోగి గోరఖ్పూర్ అర్బన్ సీటు నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీఎస్పీ పార్టీపైనా యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. బీఎస్పీ పార్టీ గుర్తయిన ఏనుగు పొట్ట పెద్దదని, అందుకే పేదల రేషన్ కూడా మొత్తం మింగేసిందని మాయవతి పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాకే ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తి కాగా, ఫిబ్రవరి 27న ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.