ముంబైకి నాసిక్ నుంచి ముంబైకి మహారాష్ట్ర రైతులు మార్చ్, మద్దతుగా శరద్ పవార్
ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రైతులు భారీ కవాతు నిర్వహించారు. నాసిక్ నుంచి రాష్ట్ర రాజధాని ముంబైకి పయనమయ్యారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ నేతృత్వంలో వేలాది మంది రైతులు ఈ కవాతులో పాల్గొన్నారు.
మరికొద్ది గంటల్లో ముంబై చేరుకోనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో సోమవారం భారీ సభ నిర్వహించనున్నారు. రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరుకానున్నారు. ఆయనతోపాటు శివసేనకు చెందిన ఆదిత్య థాక్రే, బాల సాహెబ్ థోరట్, కాంగ్రెస్, ఎన్సీపీ, వామపక్షాలకు చెందిన పలువురు నేతలు కూడా పాల్గొననున్నారు.
దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు పంజాబ్, హర్యానా రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఈ భారీ ర్యాలీని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు మహారాష్ట్రలోని 21 జిల్లాలకు చెందిన రైతులంతా శనివారం నాసిక్లో సమావేశమయ్యారు.
Farmers marching towards Mumbai under the banner of All India Kisan Sabha (#AIKS) #FarmersProtest pic.twitter.com/N6BzcnQaC0
— Sooraj Nidiyanga (@SNidiyanga) January 24, 2021
కాగా, కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది రైతులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా రహదారులపైనేవారు ఆందోలన తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ.. సఫలం కాలేదు.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదంటూ కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. చట్టాల రద్దు మినహా దేనికైనా తాము సిద్ధమేనని పేర్కొంది. అయితే, రైతు సంఘాల నేతలు కూడా వ్యవసాయ చట్టాల రద్దు తప్ప తమకేం అవసరం లేదని చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన చర్చలు ఫలవంతం కాలేదు. మరోసారి చర్చలు జరిపేందుకు అటు కేంద్రం, ఇటు రైతు సంఘాల ప్రతినిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. చర్చలు మాత్రం సఫలమయ్యేట్లు కనిపించడం లేదు. తాజా, కేంద్రం వ్యవసాయ చట్టాల అమలును ఒకటిన్నర సంవత్సరాలపాటు నిలిపివేస్తామని చెప్పినా.. రైతులు మాత్రం చట్టాల రద్దుకే డిమాండ్ చేస్తున్నారు.