సమూహ వ్యాప్తి తప్పదేమో! ఆంక్షలు సడలించినా జాగ్రత్తలు తప్పదు: నిపుణుల హెచ్చరికలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో కొంత మంచి ఫలితాలే వస్తున్నప్పటికీ మన దేశంలో కరోనావైరస్ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తూ పోతే మాత్రం ముప్పు తప్పదని తేల్చి చెబుతున్నారు.
Recommended Video

మూడో దశలో..
కాగా, కొన్ని ప్రాంతాల్లో కరోనావైరస్ మూడో దశలో ఉందని భావిస్తున్నట్లు భారత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్, డాక్టర్ కే శ్రీనాథరెడ్డి తెలిపారు. కరోనా కేసులను గమనిస్తే ప్రయాణాలకు సంబంధం లేనివిగా కనిపిస్తున్నాయని హార్వర్డ్, సిడ్నీ మెడికల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో పనిచేసిన ఆయన వ్యాఖ్యానించారు.

సమూహ వ్యాప్తి ముప్పు తప్పదేమో..
ప్రభుత్వాలు చాలా వరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన వారిపైనే దృష్టి పెట్టాయని తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉందంటున్నవారు స్థానిక వ్యాప్తిని గుర్తించగలుగుతున్నామని చెబుతున్నారని చెప్పారు. అందుకే సమూహ వ్యాప్తి అనే పదం ఉపయోగించడం లేదని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న పదజాలంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి సమూహ వ్యాప్తి ముప్పు మాత్రం తప్పేలా లేదని శ్రీనాథరెడ్డి స్పష్టం చేశారు.

ఆంక్షలు సడలించినా..
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ తోపాటు మలేషియా, నైరుతి ఆసియా దేశాలు కరోనా మరణాల రేటును తగ్గించగలిగాయని ఆయన తెలిపారు. ఎక్కువ యువత, గ్రామీణ జనాభా, ఉష్ణోగ్రత, వాతావరణం, వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు, లాక్డౌన్తో తక్కువ మరణాలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ ఆంక్షలు తొలగించినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం, మాస్కులు, చేతులు శుభ్రం చేసుకోవడం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో కరోనా కేసులు..
కాగా, దేశంలో ఇప్పటి వరకు 82,836 కేసులు నమోదు కాగా, 28,635 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 51,539 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు 2657 మంది కరోనాతోప్రాణాలు కోల్పోయారు. కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 1019 మరణాలు చోటు చేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications