మూడో ప్రపంచ యుద్దం రావచ్చు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు..
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్దం మరో రూపంలో వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సమాజంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమస్యపై పోరాడుతున్నారని అన్నారు. ప్రతీ ఒక్కరిలో అసంతృప్తి నెలకొందని.. ప్రతీచోటా హింస చోటు చేసుకుంటోందని వ్యాఖ్యానించారు.
ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయిందని.. ఆ క్రమంలో రెండు ప్రపంచ యుద్దాలు కూడా జరిగాయని మోహన్ భగవత్ గుర్తుచేశారు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్దం కూడా పొంచి ఉందన్నారు. అది మరో రూపంలో రావచ్చునని అభిప్రాయపడ్డారు. టీచర్లు,విద్యార్థులు,కార్మికులు,ఉద్యోగులు,ఉద్యోగ సంస్థలు,ప్రజలు,ప్రభుత్వాలు.. ఇలా ప్రతీ ఒక్కరు ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉన్నారని, ప్రతీ ఒక్కరిలోనూ అసంతృప్తి నెలకొని ఉందని అన్నారు.
ఆ బాధ్యత భారత్పై ఉందన్న భగవత్..
100 సంవత్సరాల క్రితం ఎవరూ ఊహించని శ్రేయస్సును దేశం పొందుతోందని మోహన్ భగవత్ అన్నారు. ప్రజలు సౌకర్యవంతంగా,సుఖంగా జీవిస్తున్నారని అన్నారు. 100 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. పానిపట్ యుద్దంలో మహారాష్ట్ర గెలిచిందో ఓడిందో అన్న సమాచారం పుణేకి చేరడానికి నెల రోజులు పట్టిందన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. మెయిల్ ద్వారా 5 నిమిషాల్లో రిప్లై పొందవచ్చన్నారు. మానవులు చివరికి రోబోలుగా మారకుండా ఉండేందుకు ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించాల్సిన బాధ్యత భారతదేశంపై ఉందన్నారు. ప్రపంచం 'గ్లోబల్ మార్కెట్' అనే అంశం గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఆటవిక రాజ్యం నడుస్తోందన్న భగవత్..
సమాజంలో వనరుల అసమాన పంపిణీని భగవత్ ఎత్తి చూపారు. వనరుల పంపిణీలో సమానత్వం లేకపోవడంవల్ల సమాజంలోని బలహీన వర్గాలను శక్తివంతులు అణచివేస్తున్నారని.. కాబట్టి మనం ఇప్పుడు
మనం మంచి సమాజంలో నివసిస్తున్నామని చెప్పడం సగం నిజమే అవుతుందన్నారు. సమాజంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు.భారతీయ జ్ఞాన శక్తిని అలవరుచుకోవడానికి యువత సిద్దంగా లేరని... జ్ఞానం,మంచి ఎప్పుడూ ఇతర దేశాల నుంచే భారత్కు వస్తాయని వారు నమ్ముతున్నారని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.
ఆ దేశాలపై విమర్శలు..
జ్ఞానాన్ని ఎక్కువ శాతం ప్రపంచ వినాశనానికే ఉపయోగిస్తున్నారని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. అమెరికా, చైనా,రష్యా అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదిగాయని, తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఇతర దేశాలను అణచివేస్తున్నాయని ఆరోపించారు. ఏదైనా చేయమని అడిగినప్పుడు మాత్రమే ఆ దేశాలు ఎంతో కొంత ప్రపంచానికి తిరిగిచ్చాయని.. అంతే తప్ప స్వతహాగా ఎప్పుడూ ఎవరికీ ఏమీ చేయలేదని అన్నారు.