‘కన్నయ్యలాల్కు పట్టిన గతే నీకూ’: ఢిల్లీ పోలీసులకు నవీన్ కుమార్ జిందాల్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లో నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఒక వ్యక్తి తల నరికి చంపిన ఒక రోజు తర్వాత.. బుధవారం నాడు తనను కూడా ఇదే విధంగా చంపుతామంటూ హెచ్చరించిన ఇమెయిల్ తనకు అందిందని బీజేపీ మాజీ నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ పేర్కొన్నారు. తనకు బెదిరింపులతో కూడిన మూడు ఇమెయిల్లు వచ్చాయని జిందాల్ ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో తెలిపారు. పంపిన వ్యక్తి తన గొంతు కోస్తానని బెదిరించాడని తెలిపారు.
'ఉదయ్పూర్లో కన్హయ్య లాల్ను చంపినట్లుగా నన్ను చంపేస్తామని బెదిరించారు. నన్ను భయపెట్టేందుకు కన్హయ్య లాల్ను చంపిన వీడియోను జత చేశారు' అని జిందాల్ ట్వీట్ చేశాడు. గతంలో కమలేష్ తివారీలా చంపేస్తానని, భూమిపై ఉన్న ఏ శక్తీ అతడిని రక్షించలేదని బెదిరించారని తెలిపారు.
నిందితులు తనను ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రావాలంటూ సవాల్ చేశారని చెప్పారు. సస్పెండ్ చేయబడిన బీజేపీ ప్రతినిధి నూపుర్ శర్మ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనకు మద్దతుగా చేసిన వ్యాఖ్యపై వివాదం చెలరేగడంతో జిందాల్ బీజేపీ నుంచి తొలగించబడ్డారు. కొద్దిరోజుల క్రితం తాను ఎవరినైనా కలవడానికి వెళ్లినప్పుడు కొందరు వ్యక్తులు తనను వెంబడించారని నవీన్ కుమార్ జిందాల్ పోలీసులకు తెలిపారు.
కాగా, ఉదయ్పూర్లో టైలర్ కన్నయ్య లాల్ను తల నరికి దారుణంగా హత్య చేసిన ఇద్దరు ఇస్లామిక్ ఉగ్రవాదులు రఫీఖ్ మొహమ్మద్, అబ్దుల్ జబ్బార్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ కూడా పాకిస్థాన్లో ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కన్నయ్య లాల్ హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది.