పోలీసులపై చిందులు, యూత్ లీడర్ జైలుకు
బుర్ద్వాన్: విద్యార్థులతో కలిసి ధర్నా చేస్తున్న నాయకుడు పోలీసులను చూస్తూనే రెచ్చిపోయాడు. "మీరు ఇక్కడి నుండి వెళ్లకపోతే నా ప్రతాపం చూపిస్తాన"ని కేకలు వేశాడు. పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో అనకూడని మాటలు అని జైలుకు వెళ్లాడు.
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీకి చెందిన యువనేత జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అతను మమతా బెనర్జీకి చెందిన తృణమల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. రాణిగంజ్ ప్రాంతం బ్లాక్ విభాగం అధ్యక్షుడిగా సౌమిత్రా బెనర్జి పని చేస్తున్నాడు.
ఇతను పార్టీ విద్యార్థి విభాగంలో నాయకుడిగా పని చేస్తున్నాడు. త్రివేణి దేవి భలోటియా కాలేజ్ లో ప్రవేశాలు (అడ్మీషన్స్)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సౌమిత్రా బెనర్జీ ఆద్వర్యంలో ప్రిన్సిపాల్ చాంబర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అంతే సౌమిత్రా బెనర్జీకి మండిపోయింది. విద్యార్థుల మాత్రం పోలీసులను చూసి భయపడిపోయి వెనక్కి తగ్గారు. ఆ సమయంలో సౌమిత్ర బెనర్జీకి కోపం వచ్చింది. పోలీసులను చూసి మీరు భయపడరాదని విద్యార్థులకు చెప్పాడు.
మనం ఇప్పుడు అధికారంలో ఉన్నామని చెప్పాడు. వెంటనే పోలీసుల వైపు చూసి 5 నిమిషాలలో మీరు కాలేజ్ క్యాంపస్ వదిలి వెళ్లాలని సూచించాడు. లేదంటే మీ జీపు ఇక్కడే కాల్చివేస్తానని హెచ్చరించాడు. చివరికి మీ పోలీస్ స్టేషన్ మీద బాంబులు వేసి పేల్చి వేస్తానని బెదిరించాడు.
విద్యార్థులు, కాలేజ్ సిబ్బంది ముందు అన్ని మాటలు మాట్లాడటంతో పోలీసులకు కోపం వచ్చింది. వెంటనే సౌమిత్రా బెనర్జీని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. కంగుతన్ని సౌమిత్రా బెనర్జీ తమ నాయకులకు ఫోన్ లు చేసి లబోదిబో అన్నాడు. అయితే అప్పటికే కేసు నమోదు అయ్యింది.