ఐటి అధికారుల వేషమేసి రూ. 27 లక్షలు దోపిడీ: ఆంధ్ర పోలీసుల అరెస్టు
బెంగళూరు: ఆదాయ పన్ను శాఖ అధికారులమంటూ అంటూబంగారు నగల షాప్ లో పని చేస్తున్న వ్యక్తిని బెదిరించి నగదు లూటీ చేసిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్ పోలీసులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు పోలీసులను విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి. జయన్న (43), కర్నూలు జిల్లా రిజర్వు బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ లు బి.వి. శేఖర్ (41), సత్యనారాయణ (41) అనే ముగ్గురు పోలీసులను అరెస్టు చేశామని మంగళవారం బెంగళూరు పోలీసులు చెప్పారు. నిందితుల నుండి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మిగనూరులో ఎం. ఆలీబేగ్ అనే వ్యక్తి బాంబే జ్యువెలర్స్ నిర్వహిస్తున్నాడు. ఇతని దగ్గర టిప్పుసుల్తాన్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆలీబేగ్ నెలలో నాలుగు సార్లు బెంగళూరులోని చిక్కపేట చేరుకుని బంగారం కొనుగోలు చేసి ఎమ్మిగనూరుకు తీసుకు వెళుతుంటారు.
ఆలీబేగ్ కు కానిస్టేబుల్ జయన్నతో పరిచయం ఉంది. జ్యువెలర్స్ షాప్ లావాదేవీల విషయం జయన్నకు తెలుసు. ఆలీబేగ్ బిజిగా ఉన్న సమయంలో అతని దగ్గర పని చేస్తున్న టిప్పుసుల్తాన్ బెంగళూరు వచ్చి బంగారం తీసుకు వెళ్తుంటాడు. ఎలాగైనా వీరి దగ్గర నగదు లూటీ చెయ్యాలని జయన్న ప్లాన్ వేశాడు.
మార్చి 12వ తేదిన టిప్పు సుల్తాన్ రూ. 27.50 లక్షలు తీసుకుని బస్సులో బెంగళూరు బయలుదేరాడు. విషయం తెలుసుకున్న జయన్న తన స్నేహితులతో కలిసి అదే బస్సులో బెంగళూరు బయలుదేరారు. బెంగళూరులోని మైసూరు బ్యాంక్ సర్కిల్ లో టిప్పు సుల్తాన్ బస్సు దిగాడు.
అదే సమయంలో జయన్నతో పాటు ఐదుగురు బస్సు దిగారు. తరువాత టిప్పు సుల్తాన్ ను పట్టుకుని తాము ఆదాయపన్ను శాఖ అధికారులు అని పోలీసు ఐడి కార్డులు చూపించి బెదిరించారు. అప్పటికే జయన్న ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న టాటా ఇండికా కారు అక్కడికి వచ్చింది.
వీరిని చూసిన టాటా ఇండికా కారు డ్రైవర్ కు అనుమానం వచ్చి ఆరుగురిని అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరకు తీసుకు వెళ్లడానికి నిరాకరించాడు. తరువాత మొబైల్ లో వేరే కారును బుక్ చేసుకున్నారు. టిప్పుసుల్తాన్ ను కారులో ఎక్కించుకుని అక్కడి నుండి బళ్లారి రోడ్డు మీదుగా బయలుదేరారు.
యలహంక సమీపంలోనికి వెళ్లిన తరువాత టిప్పు సుల్తాన్ దగ్గర ఉన్న 27 లక్షలు ఉన్న నగదు బ్యాగ్ లాక్కున్నారు. తరువాత అతనిని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వదిలి కర్నూలుకు పరారైనారు. టిప్పు సుల్తాన్ ఫిర్యాదు చెయ్యడంతో ఇన్స్ పెక్టర్లు రవిపాటిల్, రంగప్ప నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేశారు.
టిప్పు సుల్తాన్ కానిస్టేబుల్ జయన్న మీద అనుమానం వ్యక్తం చేశాడు. జయన్న మొబైల్ నెట్ వర్క్ అదే రోజు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా అతని మొబైల్ నుండి టాటా ఇండికా కారు, టయోట కారు బుక్ చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు తప్పించుకున్నారని పోలీసులు చెప్పారు.