షాక్: ఉల్లిపాయ సంచుల్లో రూ. 4.12 కోట్లు: బెంగళూరులో సీజ్
బెంగళూరులో ఉల్లిపాయలు(ఎర్రగడ్డలు) మూటల్లో తరలిస్తున్న 4.12 కోట్ల రూపాయలను బెంగళూరు సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు: పెద్దనోట్లు రద్దు అయిన తరువాత బ్లాక్ మనీని మార్పిడి చేసిన కొత్తనోట్లు తరలించడానికి సరికొత్త ఎత్తులు వేసి అడ్డంగా బుక్కైపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తరలించడానికి ప్రయత్నించినా పోలీసులకు చిక్కిపోతున్నారు.
బెంగళూరులో ఉల్లిపాయలు(ఎర్రగడ్డలు) మూటల్లో తరలిస్తున్న 4.12 కోట్ల రూపాయలను బెంగళూరు సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన మహమ్మద్ అఫ్జల్, అబ్దుల్ నాసర్, శంశుధ్దీన్ అనే ముగ్గురిని అరెస్టు చేసి మినీలారీని స్వాధీనం చేసుకున్నారు.
కేరళ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన మినీలారీలో 35 సంచుల్లో ఉల్లిపాయలు, 10 సంచుల్లో ఉర్లగడ్డలు (ఆలూ) లోడ్ చేసుకున్నారు. విద్యారణ్యపురలో నివాసం ఉంటున్న ఈ ముగ్గురు వ్యక్తులు బెంగళూరులోని కోడిగేహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటి దగ్గరకు మినిలారీని తీసుకు వెళ్లారు.
అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో సీసీబీ పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే వాహనంలోని అన్ని సంచులు పరిశీలించారు. అందులో రూ. 4,12,78,300 గుర్తించిన సీసీబీ పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురిని విచారించగా వారు పొంతనలేని సమాధానం ఇస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు. కూరగాయలు తరలించే ముసుగులో వీరు బ్లాక్ మనీ తరలిస్తున్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.