వ్యభిచారం: ముగ్గురు యువతుల వేలం, అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న మరో దారుణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు యువతులను వేలంపాటలో అమ్మేందుకు ప్రయత్నించిన ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ యజమానిని క్రైం బ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా బందీలుగా ఉంచిన వారిని వేలంపాటలో ఎక్కువ ధర పలికిన వారికి అమ్మేందుకు నిందితుడు యత్నించాడని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువతులను ఉద్యోగం చూపిస్తామని నిందితుడు ఇక్కడికి తీసుకొచ్చాడని పోలీసులు చెప్పారు.
జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ కథనం ప్రకారం.. శకుర్పూర్ ప్రాంతంలో యువతుల వేలంపాట జరుగుతోందని అందిన సమాచారం మేరకు డిసిపి దినేష్ గుప్తా నేత్వత్వంలో క్రైం బ్రాంచ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏజెన్సీ కెడి ఎంటర్ ప్రైజేస్పై సోదాలు నిర్వహించారు. అక్కడే ఉన్న ముగ్గురు యువతులను పోలీసులు కాపాడారు. ఏజెన్సీ యజమాని కపిల్ డియో చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు రవీంద్ర యాదవ్ తెలిపారు.
నిందితుడు కపిల్ డియో చౌదరి జార్ఖండ్లోని స్థానిక ఏజెంట్ వద్ద ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున చెల్లించి ఆ ముగ్గురు యువతులను కొనుగోలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ఆ ఏజెంట్ ఈ ముగ్గుర్ని కపిల్ వద్దకు పంపించాడు. కపిల్ ఆ ముగ్గుర్ని ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున ధర నిర్ణయించి వేలంపాట వేసినట్లు పోలీసులు తెలిపారు.
బాధితుల్లో ఇద్దరు యువతుల వయస్సు 20ఏళ్లకు పైగా ఉండగా, మరో యువతి మైనర్ అని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజున తొలిసారి వేలంపాట నిర్వహించారని చెప్పారు. అప్పుడు మంచి ధర రాకపోవడంతో వారిని ఆ రోజు అమ్మేందుకు యజమాని కపిల్ ఇష్టపడలేదు. ఈ కారణంగానే వేలంపాటలో నిరాశకు గురైన కొనుగోలుదారు ఒకరు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు భావిస్తున్నారు. వ్యభిచారం నిర్వహించేందుకు ఈ వేలంలో పాల్గొన్న ఇతర వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. జార్ఖండ్లో ఉన్న ఏజెంట్ను కూడా అరెస్ట్ చేసేందుకు అక్కడి పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు.