మహిళపై ఆర్మీ జవాన్ల గ్యాంగ్ రేప్
కొచ్చి : ఆర్మీ జవాన్లు ఓ మహిళపై అత్యాచారం చేసిన ఘటన కేరళలోని ఎర్నాకుళంలో చోటు చేసుకుంది. ముగ్గురు ఆర్మీ జవాన్లు కలిసి ఎర్నాకుళంలోని ఓ లాడ్జిలో మహిళపై అత్యాచారం చేశారు. ప్రియుడిగా మహిళకు దగ్గరైన మహమ్మద్ సలీమ్ (28) అనే ఓ జవాన్.. మహమ్మద్ మిస్బా (28), ఇక్బాల్ హుస్సేన్ (25) తో కలిసి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహమ్మద్ సలీమ్.. గత జనవరిలో ఎర్నాకుళంలోని ఓ లాడ్జిలో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం మొబైల్ ద్వారా ఆమె న్యూడ్ ఫోటోలను తీశాడు.
సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంటానని సలీం ఆమెను నమ్మించడంతో.. గత సోమవారం అతని పిలుపు మేరకు ఎర్నాకుళంలోని లాడ్జికి వెళ్లింది బాధిత మహిళ. దీంతో అప్పటికే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి లాడ్జి గదిలో ఉన్న సలీం.. మహిళపై సామూహిక అత్యాచారం చేశాడు. అత్యాచారం తర్వాత తీవ్ర ఆగ్రహానికి లోనైన బాధిత మహిళ మిస్బా సర్టిఫికెట్లను చించేయడంతో.. ఆమెను తీవ్రంగా కొట్టాడు మిస్బా.
దాడి తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జవాన్ల బాగోతం బయటపడింది. ఇదిలా ఉంటే.. అత్యాచారం చేసిన సలీం, మిస్బా శ్రీనగర్ మరియు కోల్ కతాలలో ఆర్మీ సప్లయిస్ కార్ప్ లో పనిచేస్తున్నారు. మరో నిందితుడు ఇక్బాల్ హుస్సేన్ కూడా పారామిలటరీ అధికారిగా విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం.