ఎన్కౌంటర్: ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా బృందం షోపియాన్లోని నాగ్బాల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. ముందుగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీతో సంబంధం కలిగి ఉన్నారని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
#ShopianEncounterUpdate: 01 more #terrorist killed (Total 03). Search going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/YCjzS6WQGA
— Kashmir Zone Police (@KashmirPolice) August 30, 2022
జమ్మూ కాశ్మీర్లోని బందిపొరా నుంచి లష్కరేకి చెందిన ఇద్దరు తీవ్రవాద సహచరులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.
వీరిద్దరినీ బందిపోరాలోని పెత్కోట్లో నివాసం ఉంటున్న మొహమ్మద్ యూసుఫ్ వానీ, బాగ్ బండిపొరా నివాసి మంజూర్ అహ్మద్ షాగా గుర్తించారు.
సోదాల్లో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న వాహనం నుంచి మూడు పిస్టల్స్తోపాటు మ్యాగజైన్లు, 24 9ఎంఎం రౌండ్లు, ఐదు హ్యాండ్ గ్రెనేడ్లు, నకిలీ పోలీసు గుర్తింపు కార్డు, దుప్పటి, నకిలీ ఆరోగ్య శాఖ గుర్తింపు కార్డు లభించాయి.