పిట్టల్లా రాలిపోతున్నారు.. కరోనా భయంతో ఒకేరోజు ముగ్గురి ఆత్మహత్య..
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 2032 పాజిటివ్ కేసులు నమోదవగా.. 58 మంది మృతి చెందారు. అయితే వైరస్పై ప్రజల్లో నెలకొన్న అపోహలు,ఆందోళనలు కూడా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వైరస్ సంక్రమణపై సరైన అవగాహన లేని కారణంగా గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కరోనా వస్తుందేమోనన్న భయంతో కొందరు.. సోకిందేమోనన్న భయంతో ఇంకొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా గురువారం( ఏప్రిల్ 2) ఒక్కరోజే ఉత్తరప్రదేశ్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్లో ఒకేరోజు ముగ్గురు..
కరోనా వైరస్ భయంతో ఉత్తరప్రదేశ్లో ఒకేరోజు ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. సహరన్పూర్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి.. తాను పనిచేసే కార్యాలయ ప్రాంగణంలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అతను డిప్రెషన్లో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. షామిలీ జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన ఓ వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతన్ని క్వారెంటైన్ చేసిన ఆసుపత్రిలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.

అవగాహన కల్పించినా..
ఇక క్వారెంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని తన కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లిన ఓ యువకుడు(23) కూడా లఖింపూర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు స్థానిక అధికారులు తెలిపారు. మార్చి 28న గురుగ్రామ్లోని ఓ క్వారెంటైన్ కేంద్రానికి అతన్ని తరలించినట్టు చెప్పారు. అంతకుముందు రెండుసార్లు అతను క్వారెంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని తనవాళ్లను కలవడానికి ప్రయత్నించాడని.. కానీ అధికారులు అతన్ని పట్టుకుని తిరిగి క్వారెంటైన్కు తీసుకొచ్చారని చెప్పారు.ఇదే క్రమంలో మంగళవారం కూడా క్వారెంటైన్ నుంచి పారిపోయిన అతను.. లఖింపూర్లో ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించినట్టు చెప్పారు. క్వారెంటైన్ అనేది వ్యాధి సంక్రమించకుండా తీసుకునే చర్య అని.. తద్వారా కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకకుండా ఉంటుందని అతనికి చెప్పామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఏదో జరుగుతోందన్న భయాందోళనతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు.
Recommended Video

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ..
అంతకుముందు మార్చి 24న కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఓ యువకుడు కాన్పూర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బరేలీలోనూ కొద్దిరోజుల క్రితం ఇద్దరు యువకులు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా భయంతో ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో అక్కల వెంకటయ్య(55) అనే వ్యక్తి కరోనా అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి స్వస్థలం వెళ్లిన అతను.. కొద్దిరోజులు ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు. ఇదే క్రమంలో మార్చి 27న గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని సూర్యాపేటలోనూ వీ.శ్రీనివాసరావు అనే వ్యక్తి కరోనా భయంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేకపోయినప్పటికీ.. కరోనా సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ లేనప్పటికీ.. తనలో తానే భయం పెంచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications