జడ్ కేటగీరిపై కేజ్రీ వివరణ, బతికున్న వారికి శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ: తాను జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అంగీకరించన్న అంగీకరించానన్న వార్తలను ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. తనకు ఎటువంటి భద్రత అవసరం లేదని, దేవుడే తనకు పెద్ద రక్ష అన్నారు. ఆయన ఆదివారం ట్విట్టర్లో భద్రతపై స్పందించారు.
తాను జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అంగీకరించినట్లుగా మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది ముమ్మాటికీ తప్పన్నారు. తాను దానికి సమ్మతించినట్లు ఉన్న ఆధారాలు చూపించగలరా అని ప్రశ్నించారు. తనకు దేవుడే పెద్ద రక్షకుడు అని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, కేజ్రీవాల్ ముఖ్యమత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వం రూ.13.41 లక్షలను ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది.

బతికున్న వారికి శ్రద్ధాంజలి
అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలతో ఉన్న వారికి శ్రద్ధాంజలి తెలిపి తప్పులో కాలేశారు. ఆయన శ్రద్ధాంజలి అర్పించిన నలుగురు సహచట్టం ఉద్యమకారుల్లో ముగ్గురు బతికే ఉన్నట్లు తేలింది. అహ్మదాబాదులో జరిగిన ఓ సభలో కేజ్రీవ్ల్ ఓ సంస్మరణ సందేశాన్ని చదివారు. ఇందులో నలుగురి పేర్లు ప్రస్తావించారు. అందులో ముగ్గురు బతికే ఉన్నారు.
పార్టీ నేత నిప్పులు
కేజ్రీవాల్పై ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు అశ్వనీ ఉపాధ్యాయ్ ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేజ్రీవాల్ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై అశ్వనీ ఉపాధ్యాయ్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ను అమెరికా గూఢచార సంస్థ సిఐఎ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) ఏజెంటుగానూ, మహా అబద్ధాల కోరుగానూ ఉపాధ్యాయ్ అభివర్ణించాడు.
ఎఎపి వ్యవస్థాపక సభ్యుడైన ఉపాధ్యాయ్ ఆదివారం మధురలో ర్యాలీ నిర్వహించేందుకు వెళ్తున్న కేజ్రీవాల్ను ఆయన నివాసం ఎదుట అడ్డుకుని దూషణలకు దిగాడు. కేజ్రీవాల్ ఇంతకుముందు ప్రస్తావించిన నిజమైన సమస్యలపై ఇప్పుడు దృష్టి సారించడం లేదని, కేజ్రీవాల్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన మహా అబద్ధాల కోరు అని ఉపాధ్యాయ్ నిందించాడు. అవినీతి, మతతత్వం, అధినాయకత్వ సంస్కృతి, వారసత్వ పాలన, కుల రాజకీయాలు తదితర సమస్యలపై పోరాటం సాగిస్తామని చెప్పిన ఎఎపి ప్రస్తుతం ఈ సమస్యల విషయంలో రాజీ పడుతోందన్నారు.
అంతేకాకుండా కేజ్రీవాల్కు ఆయన 11 ప్రశ్నలను సంధించాడు. ఈ ప్రశ్నలకు సమాధానం లభించే వరకూ కేజ్రీవాల్ నివాసం ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ఉపాధ్యాయ్ స్పష్టం చేశాడు. ఎఎపిలోని వివిధ కమిటీలకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో ఫోర్డ్ ఫౌండేషన్ వంటి అమెరికా సంస్థలకు చోటు కల్పించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన కేజ్రీవాల్ను నిలదీశారు.












Click it and Unblock the Notifications