పుతిన్ రాకముందే హడావుడి.. సెక్యూరిటీ టీమ్ ల్యాండ్ అయిపోయింది..
దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక అరుదైన మైలురాయిని నమోదు చేసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ రన్వేపై తొలిసారిగా విదేశీ మిలిటరీ విమానాలు ల్యాండ్ అయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాబోయే భారత్ పర్యటన, ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సు నేపధ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా 3 రష్యన్ సైనిక విమానాలు మంగళవారం తెల్లవారుజామున ఇక్కడ ల్యాండ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెల్లవారుజామున సీక్రెట్ ల్యాండింగ్.. సైనిక బృందాల రాక!
మంగళవారం ఉదయం సరిగ్గా 5:30 గంటల సమయంలో రష్యాకు చెందిన భారీ రవాణా విమానం 'ఐఎల్-76'తో (IL-76) సహా మొత్తం మూడు మిలిటరీ విమానాలు నోయిడా ఎయిర్పోర్ట్లో వరుసగా దిగాయి. ఈ విమానాల్లో పుతిన్ పర్యటనకు సంబంధించిన రష్యా అడ్వాన్స్ సెక్యూరిటీ టీమ్, ఉన్నతాధికారులు భారత్కు చేరుకున్నారు. బుధవారం రోజంతా కూడా ఈ విమానాలు ఎయిర్పోర్ట్ రన్వేపైనే నిలిచి ఉండటంతో రష్యన్ ప్రతినిధి బృందంతో కలిసి భారత భద్రతా సంస్థలు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి.

ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కు కాకుండా నోయిడా వైపు చూపు!
సాధారణంగా విదేశీ నేతలు లేదా విదేశీ మిలిటరీ విమానాలు భారత్కు వస్తే ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నే వినియోగిస్తుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా కొత్తగా నిర్మించిన నోయిడా ఎయిర్పోర్ట్ను ఎంచుకోవడం ఆసక్తి రేకెత్తించింది. భారీ రవాణా విమానాలు, వీవీఐపీ ప్రోటోకాల్ మూవ్మెంట్స్ను తట్టుకునేలా నోయిడా ఎయిర్పోర్ట్ ఎంతవరకు సద్ధంగా ఉందో నిరూపించేందుకు ఇది ఒక పరీక్షగా నిలిచిందని ఏవియేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఢిల్లీ బ్రిక్స్ సదస్సు.. మోదీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీ!
న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకానున్నారు. అంతకంటే ముందే సెప్టెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ ప్రత్యేక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ ఉన్నత స్థాయి భేటీకి కావలసిన ప్రోటోకాల్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ రూట్లను సిద్ధం చేయడానికే రష్యా ముందస్తు బృందం ఇక్కడికి చేరుకుంది.
రక్షణ ఒప్పందాలపైనే ప్రధాన దృష్టి!
మోదీ-పుతిన్ భేటీలో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు అత్యంత కీలకం కానున్నాయి. భారత్ గతంలో కుదుర్చుకున్న $5.43 బిలియన్ల ఎస్-400 (S-400) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో మిగిలిన చివరి రెండు యూనిట్ల సరఫరాపై క్లారిటీ రానుంది. వీటితో పాటు 5వ తరం ఫైటర్ జెట్ 'సుఖోయ్ సు-57' (Su-57) సాంకేతిక పరిజ్ఞానం, బ్రహ్మోస్ మిసైల్స్ తయారీ తదుపరి దశ ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
