ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతే, ఎక్స్ రే రూం వరకు భర్త కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన భార్య !
పేదరికంలో బతకడం, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం ఎంత నరకమో అనే విషయం కళ్లకు కట్టినట్లు కనిపించింది.
బెంగళూరు: పేదరికంలో బతకడం, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం ఎంత నరకమో అనే విషయం కళ్లకు కట్టినట్లు కనిపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లిన భార్య అక్కడి సిబ్బంది నిర్లక్షానికి నానాతంటాలు పడింది.
భర్తను మోసుకు వెళ్లే శక్తిలేని ఆమె చివరికి ఆయన కాళ్లు పట్టుకుని ఎక్స్ రే రూం వరకు లాక్కెళ్లిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని శివమొగ్గ పట్టణంలోని మెగాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
భర్త కోసం భార్య !
శివమొగ్గలో అమీర్ సాబ్, ఫమీదా అనే వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు. అమీర్ సాబ్ ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. ఫమీదా కష్టపడి భర్త అమీర్ సాబ్ ను మెగాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
ఎక్స్ రే తీసుకోని రండి !
అమీర్ సాబ్ ను పరీక్షలు చేసిన వైద్యులు ఎక్స్ రే తీసుకురావాలని ఫమీదాకు సూచించారు. తన భర్త అమీర్ సాబ్ ను ఎక్స్ రే రూం దగ్గరకు తీసుకు వెళ్లడానికి వీల్ చేర్ లేదా స్ట్రచ్చర్ ఇవ్వాలని ఫమీదా ఆసుపత్రి సిబ్బందికి మనవి చేసింది.
అయ్యా వీల్ చేర్ ఇవ్వండి !
ఫమీదాకు వీల్ చేర్, స్ట్రచ్చర్ ఇవ్వడానికి ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. ఆమె పదేపదే మనవి చేసినా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. చివరికి గత్యంతరం లేకపోవడంతో అక్కడే ఉన్న కొంత మందిని తన భర్తను ఎక్స్ రే రూం వరకు తీసుకురావాలని ఆమె మనవి చేసింది.
కాళ్లు పట్టుకుని ఈడ్చుకుని వెళ్లిన భార్య!
ఆసుపత్రిలో ఉన్న కొందరు ఫమీదాకు సహాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. చివరికి ఆమె తన భర్త అమీర్ సాబ్ కాళ్లు పట్టుకుని ఎక్స్ రే గది వరకు నేల మీద లాక్కొని వెళ్లింది. ఆ సందర్బంలో ఇక్కడే ఎక్స్ రే రూం ఉంది, ఇక చాలు అంటూ ఆసుపత్రి సిబ్బంది గట్టిగా చెప్పారు.
మొత్తం వీడియో తీశారు !
ఫమీదా తన భర్త అమీర్ సాబ్ కాళ్లు పట్టుకుని ఎక్స్ రే రూం దగ్గర వరకు లాక్కొని వెళ్లడం, అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఇదే ఎక్స్ రే రూం, ఇక చాలు అంటూ గట్టిగా చెప్పడం మొత్తం ఓ వ్యక్తి మొబైల్ లో వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నారు !
మెగాన్ ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి ఇది అంటూ ఆ వీడియోకు ఓ ట్యాగ్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న వైద్య శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. మెగాన్ ఆసుపత్రి సిబ్బందిపై విచారణకు ఆదేశించారు.
నోరు మాత్ర విప్పని కాంగ్రెస్ ప్రభుత్వం !
చికిత్స పొందడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వృద్దులు అనే కనికరం లేకుండా అమీర్ సాబ్, ఫమీదా దంపతులను వేధించిన ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరిగినా ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాని, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కాని ఇప్పటి వరకు నోరు విప్పలేదు.