గోవాపై మమత కన్ను- అక్కడా 'ఖేలా హోబే' నినాదం-చేపలు, ఫుట్ బాల్ అస్త్రాలు
పశ్చిమబెంగాల్లో బీజేపీని దీటుగా ఎదుర్కోవడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన తృణమూల్ కాంగ్రెస్.. ఇప్పుడు ఆ పార్టీకి పట్టున్న మరో రాష్ట్రం గోవాలోను సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం పశ్చిమ బెంగాల్ తరహాలోనే గోవాలోనూ ఖేలా హోబే ప్రచారాన్ని ప్రారభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని మట్టికరిపేంచేందుకు బెంగాల్తో గోవాకు ఉన్న సారూప్యతల్ని తెరపైకి తెస్తోంది.

మమతా బెనర్జీ దూకుడు
ఈ ఏడాది పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ పార్టీ అయిన బీజేపీని దీటుగా ఎదుర్కోవడమే కాకుండా హ్యాట్రిక్ గెలుపుతో వరుసగా మూడోసారి సీఎం పదవిని చేపట్టారు. నందిగ్రామ్ లో ఓటమి పాలైనా తన పాత నియోజకవర్గం భవానీపూర్ లో గెలుపు కోసం ఉపఎన్నికల్లో రంగంలోకి దిగారు. భవానీపూర్ లో మమత గెలుపు నల్లేపుపై నడకేనని అంతా భావిస్తున్నారు. దీంతో ఆమె ఓవైపు భవానీపూర్ పై దృష్టిపెడుతూనే మరోవైపు మహారాష్ట్ర పక్కనే ఉన్న గోవాపైనా దృష్టిసారిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గోవాలో సత్తాచాటుకోవాలని ఆమె పట్టుదలగా కనిపిస్తున్నారు.

గోవా అసెంబ్లీ ఎన్నికలు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇందులో బీజేపీ మరోసారి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో సీనియర్ నేత మనోహర్ పరిక్కర్ లేని లోటు ఆ పార్టీని వేధిస్తోంది. దీంతో గోవాలో విజయం కోసం స్టార్ క్యాంపెయినర్లను వెతుక్కుంటోంది. దీంతో ఇప్పుడు గోవాలో బీజేపీని టార్గెట్ చేసేందుకు ఇదే సరైన సమయంగా తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటినుంచే రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ తరఫున జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఇద్దరు నేతల్ని మమతా బెనర్జీ గోవాకు పంపారు.

గోవాకు ఓబ్రెయిన్, ప్రసూన్ బెనర్జీ
వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి పరిస్దితుల్ని అధ్యయనం చేసేందుకు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కీలక నేతలు ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తో పాటు ఫుట్ బాలర్ ప్రసూన్ బెనర్జీని రంగంలోకి దింపారు. వీరిద్దరిని వారం రోజుల పాటు గోవాలో పర్యటించి రమ్మని మమతా బెనర్జీ పంపారు. దీంతో వీరిద్దరూ ఇప్పటికే గోవాలో పర్యటిస్తున్నారు. అక్కడ పరిస్ధితుల్ని అధ్యయనం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధులను బరిలోకి దింపితే వారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై ఓబ్రెయిన్, ప్రసూన్ బెనర్జీ ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

చేపలు, ఫుట్ బాల్ తోనే 'ఖేలా హోబే'
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయానికి కారణమైన అంశాల్లో ఖేలా హోబే ప్రచారం కూడా ఒకటి ఖేలా హోబే అంటే ఆట మొదలైంది అని బెంగాలీలో అర్ధం. దీంతో బీజేపీని బెంగాల్లో ఎదుర్కొనేందుకు టీఎంసీ ప్రారఁభించిన ఖేలా హోబే ప్రచారం విజయవంతమైంది. దీంతో ఇప్పుడు అదే నినాదాన్ని గోవాలోనూ ప్రయోగించేందుకు తృణమూల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బెంగాల్ తరహాలోనే గోవాకూ ఉన్న సారూప్యతల్ని తెరపైకి తెస్తోంది. ఇందులో చేపలతో పాటు ఫుల్ బాల్ కూడా ఉంది. బెంగాల్ తో పాటు గోవాలోనూ చేపలన్నా, ఫుట్ బాల్ అన్నా విపరీతమైన మోజు. దీంతో అవే అస్త్రాల్ని గోవాలోనూ ప్రయోగించడం ద్వారా అక్కడి ఓటర్లను ఆకట్టుకునే అవకాశాల్ని తృణమూల్ అధ్యయనం చేస్తోంది.

అక్కడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే
పశ్చిమబెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ గెలుపుకు బాటలో వేసిన ఐప్యాక్ ఛీఫ్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు గోవాలోనూ ఆ పార్టీ విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం ముందుగా తృణమూల్ నేతలు డెరెక్ ఓబ్రెయిన్, ప్రసూన్ బెనర్జీ టూర్ చేస్తున్నారు. వారం రోజుల పాటు వీరు పర్యటించి అధ్యయనం చేశాక ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగబోతున్నారు. ఆ తర్వాత అక్కడి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం ప్రారంభించేందుకు తృణమూల్ సిద్దమవుతోంది. అదే సమయంలో స్ధానికంగా బీజీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కొందరు కాంగ్రెస్ నేతలు కూడా టీఎంసీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో దీదీ జోష్ మరింత పెరగబోతోంది.












Click it and Unblock the Notifications