చిన్నమ్మా కొంచెం ఉండమ్మా: లీడర్స్ రివర్స్ గేర్ తో శశికళకు షాక్
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు మద్దతు ఇస్తే మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో ఏమో ? ఇప్పుడు ఆమె అనుచరులు ఒక్కొక్కరూ చిన్నమ్మకు దూరం కావాలని ప్రయత్నిస్తున్నారు.
చిన్నమ్మకు మీరు దూరం అవుతున్నారా ? అంటే పరోక్షంగా అవుననే అంటున్నారు అన్నాడీఎంకే పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు. ఇప్పటి పరిస్థితుల్లో అదే మంచిదని చెబుతున్నారు. బుధవారం అన్నాడీఎంకే సీనియర్ నాయకులు, శశికళకు అనుచరులుగా గుర్తింపు పొందని నాయకులు పోయెస్ గార్డెన్ కు వెళ్లారు.
నమ్మక ద్రోహం ? జయలలిత, శశికళ అగ్రిమెంట్ లీక్
వారిలో కొందరు మంత్రులతో పాటు శాసన సభ్యులు, జిల్లా కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు. ఈ సమయంలో తమ నాయకురాలు చిన్నమ్మతో వారు మంతనాలు జరిపారు. గురువారం జరిగే అన్నాడీఎంకే కార్యవర్గం సమావేశం గురించి చర్చించారు.
ఇదే సమయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి శశికళకు వారు పూర్తిగా వివరించారని సమాచారం. చట్టపరంగా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాలంటే సమస్యలు ఎదురౌతాయని, అందరిని ఒప్పించి ఆపదవి మీరు తీసుకుంటే బాగుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
పార్టీ సభ్యత్వం ఐదు సంవత్సరాలు పూర్తి కావాలంటే 2017 మార్చి నెల వరకు వేచిచూడటం మంచిదని వారు శశికళకు మనవి చేశారని సమాచారం. లేదంటే ఇప్పుడు పార్టీ పదవి చేపట్టినా కోర్టు చుట్టూ తిరగవలసి వస్తుందని, ఇలాంటి పరిస్థితిలో అది అంత మంచిదికాదని నచ్చచెప్పారని తెలిసింది.
జయ మృతి: ఇంటర్వ్యూ లో నోరు విప్పిన శశికళ, నిజం చెప్పేసి?
ఇంత కాలం తనవెంట ఉన్న నాయకులు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగే ఒక్క రోజు ముందు ఇలా బాంబు పేల్చడంతో శశికళ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఇన్ని రోజులు మీరు మద్దతు ఇవ్వడం వలనే ఇంత వరకు వచ్చామని, ఇప్పుడు ఇలా అంటే ఏమి చెద్దాం ? అని శశికళ వారిని ప్రశ్నించారని తెలిసింది.
మీ మంచి కోసం చెబుతున్నామని, మూడు నెలలు ఓపికపడితే అంతా సర్దుకుంటుందని శశికళకు నచ్చచెప్పారు. మొత్తం మీద అందరి అభిప్రాయాలు తీసుకుని గురువారం జరగనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుందామని శశికళ అన్నాడీఎంకే సీనియర్ నాయకులతో చెప్పారని విశ్వసనీయ సమాచారం.