మీడియాకు చిక్కకుండా రమ్య పరుగో పరుగు: ఐటీ శాఖ అధికారుల ముందు హాజరు!
చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కు ఇప్పుడు టెన్షన్ మొదలైయ్యింది. ఇప్పటికే ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న కోట్ల రుపాయల విలువైన ఆస్తుల పత్రాలు, నగదు విషయంలో వివరణ ఇచ్చిన మంత్రి విజయభాస్కర్ గంట గంటలకు టెన్షన్ తో హడలిపోతున్నారు.
గురువారం చెన్నై నగరంలో మంత్రి విజయభాస్కర్ కుటుంబ సభ్యులను విచారిస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? అంటూ ఆయన అనుచరులు, అన్నాడీఎంకే నాయకులు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.
మంత్రి భార్యకు సమన్లు
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ భార్య రమ్యకు బుధవారం ఆదాయపన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం రమ్య విచారణకు హాజరౌతారని అందరూ అనుకున్నారు.
కోట్ల నగదు, ఆస్తులు ఎక్కడివి ?
మంత్రి విజయభాస్కర్ ఇంటిలో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు ఓ గదిలో కోటి రూపాయల నగదు, రూ. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నది రమ్య గదిలో అని సమాచారం.
ఆర్ కే నగర ఉప ఎన్నికల దెబ్బ
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లకు రూ. 89 కోట్ల బట్వాడా చేశారని వెలుగు చూసింది. ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి నుంచి నేరుగా ఆర్ కే నగర్ ఓటర్లకు నగదు బట్వాడా చేశారని ఐటీ శాఖ అధికారులు ఆధారాలు గుర్తించారు.
టీటీవీ దినకరన్ కు మద్దతు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకే (అమ్మ) శిభిరం) నుంచి టోపీ గుర్తుపై పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ కు ఓటు వెయ్యాలని స్థానిక ఓటర్లకు ఒక్కొక్కరికి రూ. 4,000 పంచిపెట్టారని ఓ వీడియో విడుదలైయ్యింది. విజయభాస్కర్ ఇంటి నుంచి నగదు తీసుకు వెళ్లారని అధికారులు గుర్తించారు.
మీడియాను తప్పించుకుని రమ్య ఎస్కేప్
గురువారం వేకువ జామున మంత్రి విజయభాస్కర్ భార్య మీడియా కళ్లు కప్పి గుట్టుచప్పుడు కాకుండా చెన్నైలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో అధికారుల ముందు హాజరైనారు. మీడియాకు ఒక్క ఫోటో కూడా చిక్కకుండా జాగ్రత్త పడిన రమ్య ఐటీ శాఖ కార్యాలయం చేరుకున్నారు. ఇప్పుడు ఆమె ఐటీ శాఖ అధికారులకు ఏం సమాధానం చెబుతారో అంటూ మంత్రి విజయభాస్కర్ అనుచరులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.