బీజేపీతో పొత్తు కొంప ముంచింది, అదేం కాదు: తమిళనాడులో వాదన, జయలలిత !
చెన్నై: తమిళనాడు సహకార శాఖ మంత్రి సెల్లూర్ రాజు బీజేపీతో పొత్తుపై తనదైన శైలిలో స్పంధించారు. బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండరాదని అమ్మ జయలలిత ఇదివరకే గట్టి నిర్ణయం తీసుకున్నారని మంత్రి సెల్లూర్ రాజు గుర్తు చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అయినందున జయలలిత అప్పట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి సెల్లూర్ రాజు మీడియాతో అన్నారు.

అదేం కాదు, రాజేంద్ర బాలాజీ
అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మంత్రి రాజేంద్ర బాలాజీ సెల్లూర్ రాజు వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే పార్టీకి ఓటమికి బీజేపీతో ఉన్న సంబంధమే కారణమని కచ్చితంగా చెప్పలేమని మంత్రి రాజేంద్ర బాలాజీ అన్నారు.

గందరగోళం
మంత్రి సెల్లూర్ రాజుది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ఈ విషయంలో ఎక్కువ చర్చ అవసరం లేదని మంత్రి రాజేంద్ర బాలాజీ అన్నారు. బీజేపీతో పొత్తు గురించి సీనియర్ మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో గందరగోళం సృష్టించింది.

ప్రధాని మోడీ ఆహ్వానం
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత కేంద్ర ప్రభుత్వంలో అన్నాడీఎంకే పార్టీకి మంత్రి పదవులు ఇస్తామని చెప్పినా జయలలిత మాత్రం వద్దని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వంలో చేరమని జయలలిత అప్పట్లో అన్నారు.

అమ్మ ఇంటిలో మోడీ చెప్పారు
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అన్నాడీఎంకే పార్టీ బయటనుంచి మద్దతు ప్రకటించింది. నరేంద్ర మోడీ చెన్నై పర్యటన సందర్బంగా ఆయన స్వయంగా జయలలిత ఇంటికి వెళ్లారు. ఆ సందర్బంలో కేంద్ర ప్రభుత్వంలో చేరాలని నరేంద్ర మోడీ చెప్పినా జయలలిత మాత్రం సున్నితంగా తిరస్కరించారు.

అమ్మ లేకుంటే ఇలాగే !
జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే నాయకులు కేంద్రంలోని బీజేపీ నేతలతో చాల సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎలాగైనా మళ్లీ లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించాలని అన్నాడీఎంకే పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications