అసలెందుకు అరెస్ట్ చేశారో, చూడండి: బాబుకు జయలలిత లేఖ
చెన్నై/విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తమ రాష్ట్రానికి చెందిన 32 మందిని ఎర్రచందనం దుంగలు కొట్టే వారిగా భావించి అరెస్ట్ చేశారని, వారిని విడుదల చేయాలని, ఇందులో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
32 మంది మంది అనుమానితులను ఏపీ పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. వారు ఎర్ర చందనం దొంగలుగా అనుమానించి అరెస్టు చేశారు. కానీ వారు అమాయకులని చెబుతూ జయలలిత ఈ లేఖను చంద్రబాబుకు రాశారు.
జయలలిత ప్రధాని మోడీకి ఈ అంశంపై లేఖ రాశారని శనివారం నాడు తొలుత వార్తలు వచ్చాయి. కేంద్రం జోక్యం కోరినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆమె లేఖ రాసింది.. చంద్రబాబుకు.
చెన్నై, తిరువన్నమలై, వెల్లూరు జిల్లాలకు చెందిన 32 మందిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారని ఆమె తన లేఖలో చంద్రబాబుకు వివరించారు. అసలు వారు గరుడాద్రి ఎక్స్ప్రెస్ రైలులో తిరుపతి వెళ్తున్నారని అందులో పేర్కొన్నారు. వారిని ఏపీ పోలీసులు రేణిగుంట రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారన్నారు.
వారి పైన ఏపీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారు చిత్తూ రు జైలులో ఉన్నారని తెలిపారు. వారు అమాయకులను, అనుమానంతో అరెస్ట్ చేశారన్నారు. అసలు వారిని చెట్లు నరికే వారిగా భావించి ఎందుకు అరెస్ట్ చేశారో తెలియడం లేదన్నారు.
కాబట్టి, తమ వారిని విడుదల చేసేందుకు మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నానని జయలలిత.. చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.