జయలలిత అంత్యక్రియల కోసం రాష్ట్రపతి ప్రణబ్ సాహసం
మంగళవారం సాయంత్రం జరిగిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు సమయానికి చేరుకోవడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పెద్ద సాహసమే చేశారు.
చెన్నై: మంగళవారం సాయంత్రం జరిగిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు సమయానికి చేరుకోవడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పెద్ద సాహసమే చేశారు. చెన్నై వరకు ఎయిర్ఫోర్స్కు చెందిన లగ్జరీ ప్లేన్ బోయింగ్ 737లో చేరుకున్న ప్రణబ్.. అక్కడి నుంచి ఎయిర్ఫోర్స్ వాళ్లు రవాణకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్లో మెరీనా బీచ్కు వెళ్లారు.
కాగా, ఈ హెలికాప్టర్లో బోయింగ్లాగా లగ్జరీ సీట్లు ఉండవు. దీంతో ప్రణబ్ ఓ బెంచ్పై సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించారు. అంతకుముందు ఢిల్లీ నుంచి చెన్నై రావడానికి మొదట ప్రణబ్ బయలుదేరినా.. విమానంలో సాంకేతిక లోపం కారణంగా బయలుదేరిన కొద్దిసేపటికే మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు.
ఇంజిన్లో తలెత్తిన లోపాన్ని సరిచేసిన కాసేపటి తర్వాత ప్రణబ్ మళ్లీ చెన్నై బయలుదేరారు. చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే.. ఆయనను మెరీనా బీచ్కు తీసుకెళ్లడానికి ఎంఐ-17 హెలికాప్టర్ను సిద్ధంగా ఉంచారు.

రాష్ట్రపతి స్థాయి వ్యక్తి ప్రయాణించడానికి అంత అనువుగా లేకపోయినా.. ప్రణబ్ మాత్రం అప్పటికే ఆలస్యం కావడంతో అందులోనే అంత్యక్రియలు జరిగే ఎంజీఆర్ మెమోరియల్ వరకు వెళ్లేందుకు సాహసించారు. దీంతో ఆయన జయలలిత అంత్యక్రియలకు ముందే హాజరయ్యారు. జయలలిత పార్టీవదేహానికి నివాళుర్పించారు.
అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రణబ్.. జయలలితకు నివాళులర్పించారు. జయ దేశ రాజకీయాల్లోనే గొప్ప నేత అని, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఆమె ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ.. తమిళ ప్రజలకు సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications